పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరాన్ని దేశ ఆక్వా రాజధానిగా నిలబెట్టాడు రైతు. ఆ ‘తెల్లబంగారం’ డాలర్ల వర్షం కురిపించిన రోజులూ ఉన్నాయిగానీ నేడు అదే చెరువు గట్లపై నిలబడి రైతు ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మే నెలలో పాలకొల్లు–భీమవరం రహదారిపై, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన రొయ్యలను కుప్పలుగా పారబోసి రైతులు ఆక్రోశించిన దృశ్యం, ఈ రంగం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రపంచానికి చెప్పకనే చెప్పింది.
ఇది ఏదో ఒక జిల్లాకు పరిమితమైన కథ కాదు. రాష్ట్రవ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు ఆక్వా రంగంపై బతుకుతున్నాయి. కేవలం పదిహేను రోజుల వ్యవధిలో 100 కౌంట్ రొయ్య ధర రూ. 270 నుంచి రూ. 215కు కుప్పకూలింది. 100 కౌంట్ రొయ్య పండించేందుకు రూ. 270 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్లో దక్కుతున్నది రూ. 220–240 మాత్రమే. యాభై దాకా ఉన్న ఎగుమతి కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించి, ‘100 కౌంట్కు రూ. 230, 40 కౌంట్కు రూ. 330, 30 కౌంట్కు రూ. 430, నెలాఖరు వరకు ఇవే రేట్లు’ అని ప్రక టించే స్థాయికి పరిస్థితి దిగజారిందంటే, మార్కెట్లో రైతుకు మిగిలే మాటే లేదని అర్థం.
మేత, సీడ్, ప్రాసెసింగ్ సంస్థలన్నీ ఒక్కటై సిండికేట్గా వ్యవహ రిస్తూ పంట చేతికొచ్చే వేళకే కొనుగోలు ధర దించుతున్నాయనీ, వాటిలో అధిక భాగం అధికార పెద్దల అనుకూలుర చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు రైతు అధిక వడ్డీ అప్పుల ఊబిలో దిగబడుతున్నాడు.
నీటిమూటలైన హామీలు ఎన్నికల ముందు ‘ఆక్వా జోన్ తో నిమిత్తం లేకుండా రైతులందరికీ యూనిట్ రూ. 1.50కే విద్యుత్’ అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా పైసా విడుదల చేయలేదు. ‘హామీని అమలుపర్చలేదు సరికదా సబ్సిడీపై ఇస్తామన్న ట్రాన్ ్సఫార్మర్లు, పరికరాలు కూడా ఇవ్వలేదు’ అని రైతులు వాపోతున్నారు. జీవో 169లోని పవర్ ఫ్యాక్టర్ నిబంధన (క్లాజ్ 4) పారిశ్రామిక ప్రమాణాలు పాటించలేని వేలాది సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు గుదిబండగా మారింది. హేచరీలకు నాణ్యమైన విద్యుత్ కావాలంటూ 2024 నవంబర్లోనే భీమవరం వేదికగా విద్యుత్ శాఖ మంత్రి ఎదుట రైతులు మొరపెట్టుకున్నారు. ‘త్వరలోనే కచ్చితమైన నిర్ణయం’ అని మంత్రి హామీ ఇచ్చి పంతొ మ్మిది నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మారిందేమీ లేదు.
ఈ నేపథ్యంలోనే గత నెల 16న ‘ఏపీ ప్రాన్ ఫెడరేషన్’ ప్రతినిధులు, మాజీ అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్, ఆక్వా రైతులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. పెరిగిన మేత ధరలు, పడిపోయిన రొయ్య ధరలు, పెరిగిన పెట్టుబడి వ్యయం, నిలిచిపోయిన రాయి తీల వ్యథను ఆయనకు వివరించారు. ఫలితంగా జూలై 15న జగన్ ఆక్వా రైతులకు అండగా భీమవరం బాట పడుతున్నారు. ఇది మామూలు రాజకీయ పర్యటన కాదు. చెరువు గట్ల మీదకే వెళ్లి రైతు కష్టాన్ని కళ్లారా చూడటం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడం, కుంగిన గుండెల్లో భరోసా నింపడం: ఈ మూడూ ఆ పర్యటన లక్ష్యాలు. ప్రజా సంకల్ప పాదయాత్రలో పశ్చిమ గోదావరి గడ్డపైనే ఆక్వా రైతుకు రూ. 1.50 విద్యుత్ మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే అక్షరాలా అమలు చేసి చూపిన నేత ఆయన. అందుకే ఆయన రాక అంటే ఆక్వా సీమకు అది కేవలం సానుభూతి పలకరింపు కాదు, అనుభవం రుజువు చేసిన భరోసా.
– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్


