అనంతపురం సెంట్రల్: అనంతపురంలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన కుమారుడితో విసిగి వేజారిన ఓ తల్లి కత్తెరతో పొడిచి చంపింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని మొదటిరోడ్డు శివాలయం సమీపంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీత, బ్రహ్మయ్య ఆచారి దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చారు.
కొంతకాలంగా మొదటిరోడ్డు శివాలయం సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమారుడు సురేంద్రచారి(28) ఉన్నాడు. వీరి కుటుంబం కార్పెంటర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తోంది. అయితే.. అవివాహితుడైన సురేంద్రచారి కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. పనికి వెళ్లకుండా మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ నిత్యం తల్లిదండ్రులపై దాడి చేస్తూ వేధించేవాడు. సోమవారం సాయంత్రం తల్లి సునీతతో గొడవ పెట్టుకున్నాడు.
పలు దఫాలు దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత అక్కడే ఉన్న దుస్తులు కత్తిరించే కత్తెరతో పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసుస్టేషన్ ఇన్చార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శరత్చంద్ర, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


