సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. ఆయన రాకతో విశాఖ వీధుల్లో భారీగా జనసందోహం కనిపించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మార్గమధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన జగన్.. పలువురి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన ఆయన.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.


కాన్వాయ్ దిగి ప్రజలతో మమేకం
పర్యటనలో భాగంగా జగన్ పలుచోట్ల కాన్వాయ్ దిగి ప్రజలతో నేరుగా మాట్లాడారు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమస్యలను విన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.


