చింతగింజలతో మైక్రోప్లాస్టిక్‌కి చెక్‌..! | Indian Teenagers Win Earth Prize 2026 | Sakshi
Sakshi News home page

చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్‌కి చెక్‌..!

Jun 2 2026 5:39 PM | Updated on Jun 2 2026 6:13 PM

Indian Teenagers Win Earth Prize 2026

ప్లాస్టిక్‌ భూతం ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. ముఖ్యంగా నీటిలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ను తొలగించడం అంత సులభం కాదు. అదీగాక నీటి నుంచి మైక్రోప్లాస్టిక్‌ని వేరుచేయడం అంటే కచ్చితంగా రసాయనాలు కలపక తప్పని పరిస్థితి, ఖర్చు కూడా అధికమే. ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపి ఎర్త్‌ప్రైజ్‌ గెలుచుకున్నారు ఈ టీనేజర్లు.

వాళ్లే వివాన్ ఛావ్చారియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అనే భారతీయ విద్యార్థుల బృందం. ఈ విద్యార్థులు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్‌లను వేరు చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిని అభివృద్ధి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం చింత గింజల పొడిని ఉపయోగించి  జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని రూపొందించారు. 

ఇది కలుషితమైన నీటిలో ఉన్న చిన్న ప్లాస్టిక్‌ కణాలకు అంటుకుంటుంది.  ప్లాస్-స్టిక్ అని పిలువబడే ఈ ఆవిష్కరణ రసాయనాలను జోడించకుండా, సాంప్రదాయ ఫిల్టర్లు తరచుగా వదిలివేసే మైక్రోప్లాస్టిక్‌లను ఎలా  బంధించగలదో పరిశోధనలో వెల్లడైంది. అంతేందుకు ఇప్పుడు వాటర్‌ టిన్‌లు, బాటిల్స్‌ అన్ని ప్లాస్టిక్‌. అందువల్ల తాగు నీటిలో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు దాగి ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వాటిని పారేసి చింతగింజలతో తయారు చేసిన ప్రత్యేక పొడితో ఈ మైక్రోప్లాస్టిక్‌ చెక్‌పెట్టారు.

ఈ చింతగింజల పొడి అయస్కాంతం మాదిరిగా ప్లాస్టిక్‌ని ఆకర్షించి వేరు చేస్తుందట. దీనివల్ల శుభ్రమైన నీటిని సులభంగా పొందొచ్చని చెబుతోంది ఆ విద్యార్థుల బృందం. సేకరించిన ప్లాస్టిక్‌ను టైల్స్ లేదా కోస్టర్స్ వంటి చిన్న, ఉపయోగకరమైన వస్తువులుగా  మారుస్తారు. ఫలితంగా అది తిరిగి ప్రకృతిలోకి చేరదు. ఈ ఆవిష్కరణలో జంతువులు, మానవులు కనిపించన ప్లాస్టిక్‌ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతామని చెబుతున్నారు. ఆ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలను సందర్శించనప్పుడే ఈ ఆలోచన తట్టిందని, అక్కడ చాలామంది ప్రజలు ప్లాస్టిక్‌ పాత్రలలోని నీటిని నిల్వ ఉంచడం చూశామని అన్నారు. 

వెనుబడిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్లాస్టిక్‌ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగి ఈ మైక్రోప్లాస్టిక్‌ బారిన పడటం చూశాక ఈ ఆవిష్కరణకు పురికొల్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావవంతమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా స్థానికంగా లభించే వనరులతోనే దీన్ని ఆవిష్కరించడంతో ఈ టీనేజర్లపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అంతా. కలుషితమైన నీటి వనరులతో ఇబ్బంది పడుతున్న వర్గాలకు ఇది గొప్ప ఆచాణాత్మకమైనదని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ విద్యార్తి బృందం ‘ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ’ ఎంపికయ్యారు. 

ఇలా గుర్తింపు  పొందిన బృందం మాదే కావడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఆ ముగ్గురు టీనేజర్లు. కాగా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రజా ఓటింగ్ ద్వారా ప్రపంచ విజేతను ఎంపిక చేశారు. అంతేగాదు ఈ ఆవిష్కరణ సంక్లిష్టమైన కాలుష్య సమస్యలను సరళమైన, ప్రకృతి ఆధారిత ఆలోచనలు ఎలా పరిష్కరించగలవో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. ఈ విజయం యువత నేతృత్వంలోని విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచవ్యాప్తంగా మైక్రోప్లాస్టిక్ తొలగింపు సాంకేతికతల కోసం పెరుగుతున్న కృషికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.

(చదవండి: ముంబై స్లమ్‌ నుంచి అంతర్జాతీయ కెరీర్‌ రేంజ్‌కు..! వైరల్‌గా టెకీ స్టోరీ)

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement