సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: యూట్యూబర్ రమా నందన(అలియాస్ నందు), ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో నందన దంపతులు కోట్లలో మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు.. ఆ దంపతులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్లో మోసం చేశారంటూ నందు దంపతులపై వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.
యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని క్రాంతి కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.


