ఢిల్లీ అగ్నిప్రమాదం: కుక్‌ నిర్లక్ష్యమే కొంపముంచిందా? | Delhi Hotel Fire Cook Arrested for Fatal Negligence | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అగ్నిప్రమాదం: కుక్‌ నిర్లక్ష్యమే కొంపముంచిందా?

Jun 6 2026 12:12 PM | Updated on Jun 6 2026 12:14 PM

Delhi Hotel Fire Cook Arrested for Fatal Negligence

న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలోని మాలవీయ నగర్ ‘ఫ్లరిష్ ఇన్’ హోటల్‌లో 21 మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ వంటవాడు (కుక్) కేశవ్ నేగిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతని నిర్లక్ష్యం  కారణంగానే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, హోటల్‌లోని ఎలక్ట్రానిక్ తలుపులు లాక్ అయిపోయి, పెను విషాదానికి దారితీసిందని పోలీసు వర్గాల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

ఒకే ఒక్క స్విచ్ కారణంగా..
పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కిచెన్‌లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన కుక్ కేశవ్ నేగి, హోటల్ మెయిన్ పవర్ స్విచ్ (ఎలక్ట్రిసిటీ సప్లై)ను పూర్తిగా ఆఫ్ చేసి, దట్టమైన పొగల మధ్య నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పారిపోయాడు. ఆయన తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే హోటల్‌లో ఉన్నవారికి మృత్యుపాశంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్‌లోని సెన్సార్ ఆధారిత ఎలక్ట్రానిక్ తలుపులన్నీ జామ్ అయిపోయాయి. లోపల ఉన్న బాధితులు బయటకు వచ్చే మార్గం లేక లోపలే చిక్కుకుపోయారు.

బాత్‌రూమ్‌లోనే భార్యాభర్తల సజీవ దహనం
ఈ ప్రమాదంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు వెలుగుచూశాయి. పవర్ కట్ కావడంతో తలుపులు తెరుచుకోక, దట్టమైన పొగలు హోటల్ అంతటా కమ్మేశాయి. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి (సీల్డ్) ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకోలేక విలవిలలాడారు. ఓ జంట (భార్యాభర్తలు) ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లగా, అక్కడ కూడా డోర్ లాక్ అయిపోయింది. బయటకు రాలేక, ఊపిరాడక వారు అక్కడికక్కడే మరణించారు. నేగి చేసిన నిర్లక్ష్యపు పనే ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి ప్రధాన కారణమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.

ముమ్మరంగా సాగుతున్న పోలీసు విచారణ
అగ్ని ప్రమాదం జరిగిన ఐదు అంతస్తుల ఈ ఇరుకైన భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్ నడుస్తుండగా, బేస్‌మెంట్, పై అంతస్తులను హోటల్‌గా ఉపయోగిస్తున్నారు.  హోటల్ యజమాని లవకేష్ బజాజ్‌ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా, తాజాగా కుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై  లోతుగా దర్యాప్తు చేయడానికి హోటల్ సిబ్బందిని, ఇతర నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement