గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఉంది. ఇలా గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుపుకోవడం వెనక స్వాతంత్య్ర సమర యోధులు బాలగంగాధర తిలక్ మహోన్నత ఆశయమే కారణం.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, అగ్ర, నిమ్న అనే వర్ణ భేదాలు లేకుండా హిందువులనందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేయడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ సార్వజనిక అంటే వీధి గణేశ ఉత్సవాలకు నాంది పలికారు.
ఫలితంగా శాస్త్రప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు ఏకదిన వ్రత విధానం మాత్రమే ప్రధానంగా ఉన్నప్పటికీ, సమాజంలో ఐకమత్యం, జాతీయ భావం పెంపొందించడానికే ఈ నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. నాటినుంచి అది కొనసాగుతోంది, అది సంతోషకరమే. అయితే అనవసర పోటీ తత్వాలు, మితిమీరిన ఆడంబరాలు వీడి అందరూ కలసి మెలసి ఐక్యంగా ఈ పండుగను నిర్వహించుకున్నప్పుడే లోకమాన్యుడి ఆశయం నెరవేరినట్టు.
– గోగులపాటి కృష్ణమోహన్, సీనియర్ పాత్రికేయులు
వ్యవస్థాపకులు, నా టీవీ అండ్ నా ఫౌండేషన్


