మహా గణపతిం భజే! | Ganesh Chaturthi celebrated in Bhadrapada month Chaturthi | Sakshi
Sakshi News home page

మహా గణపతిం భజే!

Sep 14 2026 1:02 AM | Updated on Sep 14 2026 1:02 AM

Ganesh Chaturthi celebrated in Bhadrapada month Chaturthi

ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు  నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలన కోసం అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు ఆ గణేశుడు.

సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా వర్ణించారు. మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి’. ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడు అని కీర్తించారు.

దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథునితో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది.

 ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాథ, దీనిలో అంతరార్థం ఏమిటంటే –– మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి  –– అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. 

అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది.  మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి – ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు.

వినాయకుడికి అవతారాలున్నాయా?
వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు.

వినాయకుని ఆసనంలో గల అంతరార్థం
చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ భంగిమలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. 

ఒకపక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనం ప్రతీక. అంటే జీవితంలోని ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలగడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు.

– డి.వి.ఆర్‌

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement