స్కిల్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం | Key development in the skill scam case | Sakshi
Sakshi News home page

స్కిల్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం

Jul 8 2026 3:28 AM | Updated on Jul 8 2026 3:28 AM

Key development in the skill scam case

కేసు మూసివేత తుది తీర్పు కాపీ బహిర్గతానికి ఏసీబీ కోర్టు అంగీకారం 

తుది తీర్పు కాపీని థర్డ్‌ పార్టీ అయిన తిలక్‌కు ఇచ్చేందుకు ఆమోదం 

సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2014–19 మధ్య జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి తాము వెలువరించిన తుది తీర్పు కాపీలను బహిర్గతం చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అంగీకరించింది. తుది తీర్పు కాపీలను స్కిల్‌ కుంభకోణంలో థర్డ్‌ పార్టీ అయిన కొట్టి బాలగంగాధర తిలక్‌కు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్‌.తేజోవతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే కేసుల మూసివేత 
2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అసైన్డ్‌ భూములు, ఫైబర్‌ నెట్, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, మద్యం అమ్మకాలు, ఇసుక విధానం తదితర కుంభకోణాలు జరగ్గా, వీటిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. పలు కేసుల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. 2024లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే, సీఐడీలో తనకు కావాల్సిన అధికారులను నియమించి, వారి చేత కోర్టుల్లో ఆ కుంభకోణాల తాలూకు కేసులను మూసివేయించేలా పథక రచన చేశారు. 

చంద్రబాబు చెప్పినట్లే వాటిపై తాము నమోదు చేసిన కేసులను ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా పేర్కొంటూ వాటిని మూసివేయాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్‌ రిపోర్టులు దాఖలు చేసింది. ఈ క్లోజర్‌ రిపోర్టులను అనుమతించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను మూసివేసింది. అందులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసు కూడా ఉంది. 

కేసుల మూసివేత కాపీలు ఇచ్చేందుకు నిరాకరించిన అప్పటి న్యాయాధికారి 
స్కిల్‌ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తాను హైకోర్టులో పిల్‌ దాఖలు చేశానని, అది తేలేంత వరకు కేసును మూసివేయొద్దంటూ పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్‌ తిలక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అన్ని కుంభకోణాల్లో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ల తాలూకు డాక్యుమెంట్లను ఇవ్వాలని పలువురు రాతపూర్వకంగా కోరినా ఏసీబీ కోర్టు అప్పటి న్యాయాధికారి తిరస్కరించారు. థర్డ్‌ పార్టీలకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దీనిపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. 

స్కిల్‌ కేసులో తుది తీర్పు కాపీ కోసం తిలక్‌ పిటిషన్‌ 
ఆ కుంభకోణాల కేసులను మూసివేస్తూ ఇచ్చిన తుది తీర్పు కాపీలను అందచేయాలని బాలగంగాధర్‌ తిలక్‌ ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముఖ్యంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు తుది తీర్పు కాపీని కోరారు. తిలక్‌ తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్కిల్‌ కుంభకోణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తిలక్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారని, అది పెండింగ్‌లో ఉందని ఏసీబీ కోర్టుకు వివరించారు. తాము దాఖలు చేసిన పిల్‌పై సరైన, పారదర్శక విచారణ కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఇచ్చిన తుది తీర్పు కాపీ అత్యంత అవసరమని వివరించారు. 

విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు ముందు పూర్తి, ఖచ్చితమైన వాస్తవాలను ఉంచడానికి ఈ తుది ఉత్తర్వుల కాపీ ఎంతో అవసరమని తెలిపారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం, దేశంలోని అన్ని హైకోర్టులు, దిగువ కోర్టులు పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి రోజువారీ ఉత్తర్వులు, తుది తీర్పులను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం తప్పనిసరని దుష్యంత్‌ తెలిపారు. అయితే, స్కిల్‌ కుంభకోణం కేసులో ఇచ్చిన తుది తీర్పు కాపీని ఏసీబీ కోర్టు ఇప్పటివరకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. పిటిషనర్‌ తిలక్‌ కోరిన విధంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం తాలూకు తుది తీర్పు కాపీని అందచేసేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement