సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వినాయకుని విగ్రహానికి పార్టీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


