‘న్యాయంలో జాప్యం న్యాయ నిరాకరణతో సమానం’ అని న్యాయ కోవిదులు చెబుతుంటారు... న్యాయం ఆలస్యం అయినా.. సుదీర్ఘకాలం ఎదురుచూసినా.. చివరకు తమకు న్యాయం దక్కింది.. అదే చాలని ఓ కుటుంబం సంతోషపడుతోంది.. కానీ ఆ సంతోషం వెనుక 42 ఏళ్ల నిరీక్షణ ఉంది.. కాలం మాటున కరిగిపోయిన ఓ వ్యక్తి జీవితం దాగుంది.
మధ్య వయసులో నిందితుడిగా ఆ వ్యక్తిపై ముద్ర పడింది. కోర్టు జీవితఖైదు విధించింది. బెయిల్ వచ్చినా ‘పంజరం’ బతుకైంది. కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. స్వేచ్ఛ లభించింది. కానీ, జీవితాన్ని అనుభవించడానికి వయసు, ఒంట్లో సత్తువ రెండూ మిగల్లేదు. కాలం వెనక్కి రాదు. అంతే కాదు, మరో విషాదమూ ఉంది.. ‘నేను ఏ నేరమూ చేయలేదు. నా కేసు కొట్టేశారు. నేను నిరపరాధిని’ అని సంతోషించేందుకు ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి లేదు.. ఎవరైనా చెబితే వినేందుకు వినికిడి శక్తీ మిగల్లేదు. 42 ఏళ్ల నిరీక్షణకు... 100 ఏళ్ల వయసులో కోర్టు ముగింపు పలికింది. ఆలస్యంగానైనా న్యాయం దక్కింది. నిందితుడనే మచ్చ తొలగింది.
ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా భువ్సీ గ్రామంలో భూ వివాదం ఓ వ్యక్తికి హత్యకు దారి తీసింది. పోలీసులు ముగ్గుర్ని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పత్తా లేకుండా పోయాడు. మరో నిందితుడు అప్పీలు విచారణలో ఉండగానే చనిపోయాడు. సజీవంగా ఉన్న వ్యక్తి న్యాయం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశాడు. జీవిత చరమాంకంలో నిర్దోషిగా కేసు నుంచి బయటపడ్డాడు.
హత్యకు దారి తీసిన భూ వివాదం
1982 ఆగస్టు 9న రాజుభయ్యా, అతని సోదరుడు గునువా చెరువు నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన మైకు, సత్తి్తదిన్, ధనీరామ్ ఎదురుపడ్డారు. గతంలో తన తుపాకీని లాక్కున్నాడని, తన భూమిని ఆక్రమించాడనే కోపం మైకులో ఉంది. ఇదే అదనుగా భావించి అతడిపై కాల్పులు జరిపాడు. తుపాకీ గుండు శరీరంలోకి దూసుకెళ్లింది. గునువా నేలకొరిగాడు. సత్తి్తదిన్, ధనీరామ్ చేతుల్లోనూ ఈటె, గొడ్డలి ఉన్నాయి. కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు.
కేసు నమోదు–శిక్ష ఖరారు
మైకు, సత్తిదిన్, ధనీరామ్లపై కేసు నమోదైంది. మైకు పరారయ్యాడు. ధనీరామ్ కోర్టులో లొంగిపోయాడు. 1984 జూన్లో హమీర్పూర్ అదనపు సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 34 కింద దోషులుగా తేల్చి సత్తిదిన్, ధనీరామ్లకు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది ధనీరామ్కు బెయిల్ మంజూరైంది.
అలహాబాద్ కోర్టులో అప్పీలు
లోయర్ కోర్టు విధించిన శిక్షపై ఇద్దరు నిందితులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అప్పీలు దశలోనే సత్తిదిన్ మృతి చెందాడు. ధనీరామ్ ఒక్కడే మిగిలాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఈ కేసు నడిచింది. ఇద్దరు సాక్షులను కోర్టు మరోసారి విచారించింది. కేసు పత్రాలన్నీ పరిశీలించింది.
సాక్ష్యాలు.. ఎఫ్ఐఆర్లో తేడాలు
కేసులో ప్రధాన సాక్షి రాజుభాయ్, మరో సాక్షి రామా కింది కోర్టులో చెప్పిన సాక్ష్యానికి, హైకోర్టులో చెప్పిన వివరాలకు తేడాలను గుర్తించింది.. వారు చెప్పిన దానికి భిన్నంగా వైద్య నివేదిక ఉంది. వారి వాంగ్మూలాలు నమ్మదగినట్టుగా లేవని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ఐఆర్లోనూ పలు లోపాలు విచారణలో బయటపడ్డాయి. ధనిరామ్ చేతిలో గొడ్డలి ఉంది తప్ప మృతుడిపై ఆ మారణాయుధం తాలూకు గాయాలు లేవని వైద్యుడి నివేదిక స్పష్టం చేసింది.
కింది కోర్టు తీర్పు కొట్టివేత
సాక్ష్యాధారాలను సహేతుకమైన సందేహాలతో కింది కోర్టు విశ్లేషించలేదని హైకోర్టు ధర్మాసనం భావించింది. ప్రాసిక్యూషన్ నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయిందని పేర్కొంది. కేసు సుదీర్ఘకాలం నడవడం, నిందితుడి వయస్సు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. గతంలో ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ‘సాక్ష్యాల’ పరిశీలనపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితఖైదును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పీలుదారుకి విముక్తి కల్పించింది. ‘నాతండ్రి నిర్దోషి అని తేలడం మాకు ఆనందం. చాలా ఆలస్యమైనా మాకు న్యాయం జరిగింది’ అని ధనీరామ్ కుమారుడు లల్లూరామ్ భావోద్వేగంతో స్పందించాడు.


