లండన్లో విషాదం చోటుచేసుకుంది. లండన్లోని ఒక విలాసవంతమైన నివాస భవనంలో 36వ అంతస్తు బాల్కనీ నుండి కింద పడి భారత సంతతికి చెందిన దంపతులు, వారి తొమ్మిదేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన మే 27న దక్షిణ లండన్లోని 46 అంతస్తుల భవనంలో జరిగింది.
మే 27న భవనం 36వ అంతస్తులపైనుంచి కింద పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇవ్వడంతో అత్యవసర సేవా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారామెడిక్స్ వారిని బతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాకేష్ పై (47), ఆయన భార్య అదితి పరల్కర్ (46) తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ (9) అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు. ఇది ఆత్మహత్యా లేక హత్య అనే సందేహాలు వెల్లువెత్తాయి.
సిద్కు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని, ఇదే వారి ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేశ్, ఆదితి 2020లో భారత్లో తమ కుమారుడికి వైద్యం చేయించారని, అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడం, ఇక దీనికి చికిత్స లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో వారు లండన్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
ఘోర విషాదం, ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించడం చాలా బాధాకరం, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో యూకేలోనే పుట్టాడని, ఆ సమస్యలే వారు ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని స్థానిక ఎంపీ నీల్ కోయల్ ఆ భవన నివాసితులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ దంపతులు ఫైనాన్స్ , నిర్మాణ రంగ కన్సల్టింగ్ విభాగాల్లో పనిచేసేవారు. ఫ్రెండ్స్ అంతా వీరిని 'ఆది' 'రాబిన్' అని పిల్చుకునే వారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ అనారోగ్యం విషయంలో అదితి బాగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా, రాబిన్ ప్రశాంతంగా, పరిస్థితులను మేనేజ్ చేసేవాడని గుర్తు చేసుకున్నారు.
మరోవైపు ఈ విషాదానికి కొన్ని వారాల ముందు, వీరి ఇంటినుంచి అరుపులు కేకలు వినిపించాయని పొరుగువారు పోలీసులకు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు ప్రకటించారు.
ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త


