న్యూఢిల్లీ: భారత ఇంజనీరింగ్ చరిత్రలో మరో సరికొత్త మైలురాయి నమోదైంది. అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ బై-డైరెక్షనల్ టన్నెల్ ‘జోజిలా సొరంగం’ ప్రధాన విభాగం అనుసంధాన ప్రక్రియ (బ్రేక్థ్రూ) విజయవంతంగా పూర్తయింది. సుమారు 11,578 అడుగుల ఎత్తులో, 13.153 కిలోమీటర్ల పొడవునా గుర్రపు నాడా ఆకారంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వీక్షించారు. భారతీయ ఇంజనీర్ల అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.
3 గంటల ప్రయాణం.. 15 నిమిషాల్లోనే!
ప్రస్తుతం సోనామార్గ్ నుంచి ద్రాస్, కార్గిల్, లడఖ్ వెళ్లే ప్రయాణికులు అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ గుండా వెళ్లాల్సి వస్తోంది. తీవ్రమైన మంచు తుఫానులు, ప్రమాదకరమైన మలుపులతో కూడిన ఈ మార్గంలో ప్రయాణం ప్రాణాంతకంగా సాగుతుంది. అయితే 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం పడుతున్న 3.5 గంటల సుదీర్ఘ ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గిపోనుంది. ఇది జమ్ముకశ్మీర్లోని బాల్తాల్ (సోనామార్గ్), లడఖ్లోని మణిమార్గ్ (ద్రాస్) ప్రాంతాలను నేరుగా కలుపుతుంది.
ఏడాది పొడవునా నిరంతర రవాణా
శీతాకాలంలో భారీ హిమపాతం, మంచు కొండలు విరిగిపడటం వల్ల ప్రతి ఏడాది జోజిలా పాస్ దాదాపు 5 నుండి 6 నెలల పాటు పూర్తిగా మూతపడేది. దీనివల్ల లడఖ్ ప్రాంతానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయి.. రేషన్, మందులు, నిత్యావసర వస్తువుల తీవ్ర కొరత ఏర్పడేది. ఇకపై ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ మెగా టన్నెల్ ద్వారా వాతావరణంతో సంబంధం లేకుండా, ఏడాది పొడవునా కశ్మీర్ నుండి లడఖ్ వరకు వాహనాల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి.
సైన్యానికి బలం.. పర్యాటకానికి ఊతం
చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు పంచుకునే ఈ అత్యంత సున్నితమైన ప్రాంతంలో భారత సైన్యానికి ఈ టన్నెల్ ఒక రక్షణ కవచంలా మారనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సరిహద్దులకు సైనికులను, భారీ ట్యాంకులను, యుద్ధ సామగ్రిని వేగంగా తరలించడానికి ఇది దోహదపడుతుంది. దీనితో పాటు, లడఖ్, కార్గిల్, సోనామార్గ్లలో ఏడాది పొడవునా పర్యాటకం వర్ధిల్లుతుంది. శీతాకాలంలోనూ పర్యాటకుల రాక పెరగడం వల్ల హోటళ్లు, రవాణా, స్థానిక హస్తకళల రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్’కు పోటీగా ‘సుప్రీం’ మాజీ జడ్జి ‘ఇష్క్’ పార్టీ!


