న్యూఢిల్లీ: ట్రంప్ ప్రభుత్వం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పౌరసత్వాల రద్దు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మోసపూరిత పద్ధతుల్లో, తప్పుడు సమాచారంతో అమెరికా పౌరసత్వం పొందిన 17 మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ జాబితాలో న్యూజెర్సీకి చెందిన భారతీయ సంతతి వ్యాపారవేత్త, మాజీ సీఈఓ నీరజ్ శర్మ (50) పేరు ఉండటం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.
వీసా మోసం.. ఫోర్జరీ
భారత్లో జన్మించిన నీరజ్ శర్మ, ‘మాగ్నానివిజన్ ఎల్ఎల్సీ’ అనే ఐటీ స్టాఫింగ్ కంపెనీని నిర్వహిస్తూ విదేశీ ఉద్యోగుల తరపున హెచ్-1బీ వీసా పిటిషన్లను దాఖలు చేసేవారు. ఒక ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలో ఈ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు చూపుతూ.. ఆయన 11 నకిలీ హెచ్-1బీ పిటిషన్లను సమర్పించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ దరఖాస్తుల కోసం సదరు సంస్థ ఎగ్జిక్యూటివ్ల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ పత్రాలను కూడా సృష్టించినట్లు తేలింది. ఈ మోసం 2015 నుండి 2017 మధ్య కాలంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు.
పౌరసత్వం రద్దుకు దారితీసిన అబద్ధం
నీరజ్ శర్మ డిసెంబర్ 2017లో అమెరికా పౌరసత్వం పొందారు. అయితే పౌరసత్వ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆయన .. తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన వీసా మోసం కేసులో దోషిగా తేలారు. తాజా కోర్టు ఫైలింగ్స్ ప్రకారం.. పౌరసత్వ అర్హతను దెబ్బతీసే తన నేరపూరిత ప్రవర్తనను శర్మ ఉద్దేశపూర్వకంగా దాచారని న్యాయ శాఖ వాదిస్తోంది. మోసపూరిత సమాచారంతో పొందిన పౌరసత్వాన్ని చట్టప్రకారం రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం పట్టుబడుతోంది.
ట్రంప్ సర్కార్ వేటలో మరికొందరు
అమెరికా ప్రభుత్వం కేవలం వలసల మోసాలకే పరిమితం కాకుండా.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని కూడా ఏరివేస్తోంది. ఈ 17 మంది జాబితాలో చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, మనీలాండరింగ్, వైర్ ఫ్రాడ్, డ్రగ్స్ వంటి ఘోరమైన నేరాలకు పాల్పడి పౌరసత్వం పొందిన వారు ఉన్నారు. వీరిలో ఒక హైతీ వలసదారుడు, కొలంబియాకు చెందిన మాజీ క్యాథలిక్ ప్రీస్ట్, మెక్సికోకు చెందిన వ్యక్తితో పాటు మాజీ యుగోస్లావ్ పౌరుడు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్ఫాస్ట్.. ఇంకా..


