ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నీలినీడలు | SC says PIL has become paisa interest litigation, Check PIL importance | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నీలినీడలు

Jun 9 2026 10:46 AM | Updated on Jun 9 2026 11:09 AM

SC says PIL has become paisa interest litigation, Check PIL importance

శబరిమల మందిరంలోకి 10–50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలను అను మతించే విషయంలో ఇంతక్రితం తీర్పును సుప్రీం కోర్టు పునః సమీక్షించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే.  ‘ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌’ సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)లో సుప్రీం కోర్టు స్త్రీలందరూ శబరిమల మందిరంలోకి వెళ్లవచ్చని 2018లో తీర్పు చెప్పింది. శబరిమల ఆలయ పూజారితో సహా పలువురు దాఖలు చేసిన పునఃసమీక్ష పిటిషన్‌ విచారణ సందర్భంగా, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దుర్విని యోగం చేస్తున్నారనీ, ఇప్పుడు సాంకేతికత పెరిగి న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల లక్ష్యం నెరవేరిందనీ, ఇక ఈ వ్యాజ్యాలకు స్వస్తి పలకా లని భారత సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. సుప్రీం కోర్టు కూడా ‘ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌’ వారు ఇలాంటి వ్యాజ్యాన్ని వేసినందుకు అసహనం వ్యక్తం చేసింది.  

నిజానికి ఎవరైనా కోర్టులో వ్యాజ్యం వేయాలంటే తనే బాధి తుడు అయ్యుండాలి. అతని తరఫున మరెవరూ వ్యాజ్యం వేయ రాదు. దీన్నే ‘లోకస్‌ స్టాండయి’ అంటారు. ఏదైనా వ్యాజ్యం విచారించేముందు, ఆ వ్యాజ్యంలో పిటిషనర్‌ ఏ విధంగా బాధితుడో కోర్టులు తప్పనిసరిగా పరిశీలిస్తాయి. ఒకవేళ పిటిషనర్‌కు ఆ వ్యాజ్యంతో వ్యక్తిగ తంగా సంబంధం లేకపోతే కోర్టులు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేస్తాయి.  

ఆమెతో మొదలు...
అయితే కపిలా హింగోరాని అనే మహిళా న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు ఆద్యురాలిగా నిలిచారు. 1979లో మొదటి సారిగా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి, ఎన్నో ఏళ్లుగా దయనీయమైన స్థితిలో జైళ్ళలో మగ్గుతున్న స్త్రీ, బాల, వృద్ధు లతో సహా వేల సంఖ్యలో ‘అండర్‌ ట్రైయల్‌ ఖైదీల’ను విడుదల చేయించారు. సుప్రీం కోర్ట్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ వి. ఆర్‌. కృష్ణ అయ్యర్, జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి చొరవతో ‘లోకస్‌ స్టాండయి’ నియ మాన్ని పక్కన పెట్టి న్యాయం వైపు నిలబడ్డారు. తరువాత మరెన్నో కేసుల్లో పిల్‌ను జస్టిస్‌ భగవతి అనుమతించారు. ఒక వ్యక్తికిగానీ, ఒక సమూహానికిగానీ హక్కుల భంగం జరిగి... పేదరికం చేతగానీ, సాంఘికంగా వెనుకబాటుతనం వల్లగానీ న్యాయ స్థానాలను ఆశ్ర యించలేనివారి హక్కులను కాపాడేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఏ నాగరీకుడైనా ముందుకు రావచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటినుంచి ఎంతోమంది ప్రజాహితం కోరి ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి చట్టాల్లో మార్పు కోసం శ్రమించారు.  

ప్రభుత్వ అధికారుల కార్ల మీద ఉపయోగించే ఎర్ర బుగ్గ కేసు నుంచి, పబ్లిక్‌ స్థలాల్లో మైకుల ఉపయోగం, సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలపించడం, దీపావళి టపాకాయల నియంత్రణ, పర్యావరణం, వాహనాలకు తప్పనిసరి సీట్‌ బెల్ట్, బ్లడ్‌ బాంకులు, వీధి కుక్కల బెడద, పని చేసే ప్రదేశాలల్లో లైంగిక హింస, రహదారి ప్రమాదాలు వంటి ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్స్‌ లేకుంటే ఎన్నో విస్తృత ప్రజా ప్రయోజనాలు చేకూరేవి కాదు.

అయితే, కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా కీర్తి కాంక్షతో వీటిని దాఖలు చేస్తున్నారు. వీటిని ‘పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్లు’గా కాక ‘ప్రైవేట్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్లు’గా సుప్రీం కోర్టు అభివర్ణించింది. విచారాణార్హం కాని వ్యాజ్యాలను, సుప్రీం కోర్టు, హైకోర్టులు భారీ జరిమానాలు విధించి తిరస్కరిస్తున్నాయి. కోర్టుల విలువైన సమయం వీటి వలన వృథా అవుతున్నదన్న మాట నిజమే అయినా... కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ‘పిల్‌’ను ఉపసంహరించరాదు.  

– కె.ఎస్‌.హరీశ్‌ కుమార్‌ ‘ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (లా) రిటైర్డ్ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

Advertisement
 
Advertisement
Advertisement