యూసుఫ్ పఠాన్‌కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్! | Mahua Moitra Blasts On Yusuf Pathan and Rebels Over NDA Shift Rumors | Sakshi
Sakshi News home page

యూసుఫ్ పఠాన్‌కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్!

Jun 9 2026 8:25 AM | Updated on Jun 9 2026 11:47 AM

Mahua Moitra Blasts On Yusuf Pathan and Rebels Over NDA Shift Rumors

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లు  ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) వైపు అడుగులు వేస్తున్నారనే ఊహాగానాల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాల దరిమిలా టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా తిరుగుబాటుదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మ్యాండేట్‌ను ఉల్లంఘించి ఎన్డీఏతో చేతులు కలపాలని చూస్తున్న వారిని స్వార్థపరులుగా, దేశద్రోహులుగా ఆమె అభివర్ణించారు.

‘వెన్నెముక ఉండాలి'.. యూసుఫ్ పఠాన్‌పై ఆగ్రహం
మహువా మోయిత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌' లో చేసిన ఒక పోస్ట్‌లో మాజీ క్రికెటర్, టీంఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను నేరుగా టార్గెట్ చేశారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి పరిగెడుతున్నారా? కాస్త ధైర్యం ప్రదర్శించండి. మీరు భారతదేశం తరపున ఆడారు. మా జిల్లా ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. కాస్త సిగ్గు, వెన్నెముక ఉండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తీర్పు టీఎంసీకి ఇచ్చినదని, ఎన్డీఏకు కాదని ఆమె స్పష్టం చేశారు.

బీజేపీ టికెట్‌పై గెలవాలని సవాల్
పార్టీ మారే ఆలోచనలో ఉన్న అసమ్మతి ఎంపీలకు మహువా మోయిత్రా ఒక బహిరంగ సవాల్ విసిరారు. పసుపు రంగు మరకలున్న ప్యాంట్లు వేసుకున్న స్వార్థపూరిత దేశద్రోహులంతా వెంటనే బీజేపీలో చేరవచ్చని, అయితే ముందుగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, తిరిగి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ వెలుపల వారి ఎన్నికల బలం ఎంతో నిరూపించుకోవాలని, అప్పుడే వారు ఎంతటి వీరులో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

తల వంచేది లేదు: కాకోలి ఘోష్ దస్తీదార్
మరోవైపు లోక్‌సభలో ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు కోరిన 20 మంది అసమ్మతి ఎంపీల గ్రూపులో ఉన్న రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ఈ విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ‘నా తల తెగినా వంగేది లేదు, నేను ఇప్పటికే చాలా భరించాను’ అని ఆమె మీడియా సంస్థ ‘ఏఎన్‌ఐ’తో అన్నారు. తానేమీ 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలోకి రాలేదని, గత 40 ఏళ్లుగా ఇక్కడే పోరాడుతున్నానని చెప్పారు. తనకు జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్‌మెంట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement