నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8.. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో ఉంటే, ప్రస్తుతం కూటమి పాలనలో అది ఎనిమిదో ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్లు పదేపదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేశాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏడెనిమిది శాతం అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనెవ్వరికి కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? పరిశ్రమలు వచ్చేశాయా?ఉద్యోగాలు వచ్చేశాయా? వస్తున్నాయా? అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరి ఆడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి.
నిజంగా ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కాని అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంటులో కూడ వెల్లడైపోయింది. లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఏడువేల కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కార్ పరువు మరింత దిగజారినట్లయింది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమలవారితో మాట్లాడినప్పుడుకాని, సదస్సులలోకాని ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కాని పారిశ్రిమికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ ఉంది.
మోసకారి నటి జత్వాని కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను కూడా ఇరికించి ముగ్గురు ఐపీఎస్లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నానా రభస చేసింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా, తాము మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డామేజీ జరిగి ఉంటుంది.
అంతేకాదు.. విశాఖ వంటి కీలక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరువు తీసి ఉండాలి. ఏపీకి పరిశ్రమలు రావడానికి వెనుకాడుతున్నందున వీరు ఈ భూమిని ఇంత కారుచౌకగా, వేల కోట్ల లాభాలు వచ్చే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న సంకేతం కూడా నష్టం చేసిందేమో తెలియదు. పైగా కొన్ని సంస్థలకే ఇలా ఇవ్వడం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. కార్పొరేట్ సంస్థల మాటున తమకు కావల్సినవారికి కూడా కారుచౌకగా ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రభుత్వపరంగా పాలనకన్నా, ప్రతీకార రాజకీయాలకు, రెడ్బుక్ పేరుతో అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికలలో ఏపీ ర్యాంకింగ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో నీతి అయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకటి నుంచి ఎనిమిదికి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, వచ్చినా నీతి అయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికి తెలిసిపోతుంటాయి. మరో వైపు జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే, వాటిని ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
రామాయంపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో రెండేళ్ల కరోనా ఉన్నా, అన్ని వాగ్దానాలు అమలు చేసినా, ఆ ప్రభుత్వ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఎంతో సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ప్రభుత్వం రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఇక పరిశ్రమలవారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది.
కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత మధ్య జరిగిన రగడ ఇంత, అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వబోమని బెదిరించారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరేసరి. పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది.
జగన్ టైమ్లో పలు పరిశ్రమలు వచ్చినా, రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికీ ఆపడం లేదు. తాజాగా అమరరాజా ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమ పెట్టుకుంది. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమివేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్ల చేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమరరాజా సంగతి సరే! జగన్ టైమ్లో అది ఎక్కడకు వెళ్లలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్ల నుంచి సమాధానం లేదు.
రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సుగ్గుగా చెబుతోంది. ఇది చిత్రంగా అనిపించదూ! నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే అప్పుడు నెంబర్ ఒన్ ర్యాంక్ ఎలా వస్తుంది? ప్రస్తుతం అంతా సజావుగా ఉంటే ర్యాంకు ఎందుకు పతనం అవుతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


