రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసేందుకు రంగం సిద్దమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన భారత జట్టులో 15 ఏళ్ల సూర్యవంశీకి చోటు దక్కింది. దీంతో భారత జట్టు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ టెండూల్కర్ను వైభవ్ అధిగమించాడు.
సచిన్ 16 ఏళ్ల వయస్సులో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతి చిన్న వయస్సులోనే భారత జట్టు ఎంపికైన వైభవ్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడిని క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్మాన్లతో పోల్చడం సరికాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా వైభవ్ టీమిండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని సంజీవ్ తెలిపాడు.
సంజీవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సచిన్, బ్రాడ్మన్లతో వైభవ్ను పోల్చడం నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ లెజండరీ క్రికెటర్లు అత్యున్నత స్థాయిలో దశాబ్దాల పాటు రాణించి, దేశానికి ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ప్రస్తుతం వైభవ్ వారి పాదాల దుమ్ముతో కూడా సమానం కాడు.
కాబట్టి ఇలాంటి పోలికలు అస్సలు పెట్టవద్దు. అదేవిధంగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు కూడా లెఫ్ట్ హ్యాండరే. కాబట్టి లారా బ్యాటింగ్ వీడియోలను వైభవ్కు చూపించాను. గత కొన్నేళ్లుగా లారా, యువరాజ్ సింగ్, ఇతర క్రికెటర్ల బ్యాటింగ్ వీడియోలు కూడా వైభవ్ చూస్తున్నాడు.
అయినప్పటికి అతడి ఆటతీరు పూర్తిగా విలక్షణంగా ఉంటుంది. అతడు ఎవరిని అనుకరించకుండా తనదైన శైలిలో క్రికెట్ ఆడతున్నాడని" పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో వైభవ్ దుమ్ములేపాడు. 776 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.
చదవండి: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!?


