భారత క్రికెట్లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసింది. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించారు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలకు ప్రకటించిన భారత జట్లలో సూర్యకుమార్కు కనీసం ఆటగాడిగా కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. పేలవ ఫామ్ కారణంగానే సెలక్టర్లు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
భారత్కు ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ను అందించినప్పటికి అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఐపీఎల్-2026లోనూ సూర్య రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ 13 ఇన్నింగ్స్ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ కారణాలతో అతడిని జట్టు నుంచి తప్పించారు.
సూర్య రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?
అయితే సూర్యకుమార్పై వేటు పడిన కొద్దిసేపటికే అతడికి సంబందించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. విమర్శలు, ఆన్లైన్ ట్రోలింగ్ వల్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను" అంటూ సూర్యకుమార్ పేరుతో ఉన్న ఒక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా స్క్రీన్షాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అయితే అది ఫేక్ పోస్ట్ అని తేలింది. @unreal_skyy అనే ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో ఆకతాయి చేసిన పోస్ట్ అది. అంతే తప్ప స్కై నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ అతడి రిటైర్మెంట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సూర్య ప్రస్తుతం ముంబై టీ20 లీగ్లో ఆడుతున్నాడు.
చదవండి: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?


