టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఊహించని షాకిచ్చింది. కెప్టెన్సీ బాధ్యతలతో పాటు పూర్తిగా జట్టు నుంచి కూడా అతడిని తప్పించింది. 2026 టీ20 ప్రపంచకప్లో భారత్కు ట్రోఫీ అందించినప్పటికీ, వ్యక్తిగత ఫామ్ లేమి కారణంగా సూర్యకుమార్పై వేటు వేశారు.
అతడి స్దానంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్ కోసం జట్టు ఎంపిక సందర్భంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై పూర్తి స్ధాయిలో దేశవాళీ క్రికెట్లో ఆడాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోయేషన్కు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆడాలనేది తన కల అని స్కై ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు తన కలను నెరవేర్చుకునే దిశగా సూర్య అడుగులు వేయనున్నాడు. తన ఫామ్ను తిరిగి సాధించడానికి, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి దేశవాళీ టోర్నమెంట్లు ఆడాలని మిస్టర్ 360 ఫిక్స్ అయ్యాడు.
అతడు చివరగా డొమాస్టిక్ క్రికెట్లో ఈ ఏడాది జనవరిలో ముంబై తరపున విజయ్హాజరే ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. రెడ్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే గతేడాది జనవరిలో విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్లో బరిలోకి దిగాడు.
సూర్యకుమార్ ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న దులీప్ ట్రోఫీ వెస్ట్జోన్కు ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టు తరఫున రెడ్ బాల్ క్రికెట్లో మొత్తం 14 సెంచరీలు సాధించాడు. అతడు ప్రస్తుతం ముంబై టీ20 లీగ్లో బిజీ బిజీగా ఉన్నాడు.
చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన!


