‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Nithya Menon React On Peddi Controversy | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Jun 8 2026 9:10 AM | Updated on Jun 8 2026 11:06 AM

Nithya Menon React On Peddi Controversy

‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ పోషించిన అచ్చియమ్మ పాత్రపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒకవైపు రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు జల్లు కురిపిస్తూనే మరోవైపు జాన్వీ పాత్రపై విమర్శలు చేస్తున్నారు.  ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అయితే తెరపై జాన్వీని చూపించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బుచ్చిబాబు వెంటనే స్పందించి..మహిళలకు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగిస్తామని ప్రకటించాడు. అయినప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోయిన్లు సైతం జాన్వీని అభ్యంతరకంగా చూపించారని మండిపడుతున్నారు. ఇప్పటికే డింపుల్‌ హయాతీ, అషికా రంగనాథ్‌తో పాటు కొంతమంది బాలీవుడ్‌ తారలు కూడా దీనిపై స్పందించారు. తాజాగా సహజ నటి నిత్యామీనన్‌ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

తెరపై మహిళలను ఓ ఆట బొమ్మలా  చూపించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తాను పెద్ది సినిమా చూడలేదని, అయినప్పటికీ జాన్వీ కపూర్‌కి తన మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. సినిమాల్లో మహిళలను వస్తువుతా చూపించడం కేవలం దక్షిణాది చిత్రపరిశ్రమకే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలో ఇదొక ప్రధాన సమస్యగా మారిందని నిత్యా అభిప్రాయపడ్డారు.

‘వాణిజ్య పరమైన అంశాలను జత చేయాలనే ఒత్తిడితో మహిళా పాత్రలను శృతిమించి చూపిస్తున్నారు. ఈ విషయంలో హీరోయిన్లే స్వీయ నియంత్రణ పాటించాలి. హద్దు దాటినట్లుగా అనిపిస్తే.. ఆ పాత్రని రిజెక్ట్‌ చేయాలి. తమని తెరపై ఓ వస్తువులా చూపిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే నో చెప్పేయాలి’ అని నిత్యా సలహా ఇచ్చారు. 

పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తొలి రోజే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్స్‌ మాత్రం భారీగానే వచ్చాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 236.7 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించినట్లు మేకర్స్‌ ‍ ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement