ప్రేమించాడనే కక్షతో ఘోరం: గదిలో బంధించి, కర్రలతో కొట్టి.. | Dalit Teen Beaten to Death Over Friendship with Upper-Caste Girl in Uttarakhand | Sakshi
Sakshi News home page

ప్రేమించాడనే కక్షతో ఘోరం: గదిలో బంధించి, కర్రలతో కొట్టి..

Jun 9 2026 11:42 AM | Updated on Jun 9 2026 11:42 AM

Dalit Teen Beaten to Death Over Friendship with Upper-Caste Girl in Uttarakhand

తెహ్రీ గర్హ్వాల్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఒక విషాద ఘటన వెలుగుచూసింది. తమ ఇంటి అమ్మాయితో స్నేహం చేశాడనే నెపంతో 18 ఏళ్ల ఒక దళిత యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయగా, పోలీసులు నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

అర్ధరాత్రి పిలిచి..
మృతుడు కేతన్ లాల్ గత ఆరు నెలలుగా సదరు యువతితో స్నేహంగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో సదరు యువతి నుంచి ఫోన్ రావడంతో, కేతన్ తన స్నేహితుడైన దివాకర్ దిమ్రీతో కలిసి ఆమె నివసించే ఖోల్‌గఢ్ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడకు చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు వీరిద్దరినీ ఒక గదిలో బంధించి, కర్రలతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు.

రక్తపు మడుగులో కుమారుడు
మరుసటి రోజు ఉదయం ఆ యువతి తండ్రి.. కేతన్ తండ్రి ధన్‌పాల్ లాల్‌కు ఫోన్ చేసి, నీ కొడుకును వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. ధన్‌పాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, కేతన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో గాయపడిన కేతన్ స్నేహితుడు దివాకర్ ప్రస్తుతం బౌరారీలోని జిల్లా  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రంగంలోకి పోలీసులు.. నిందితుడి అరెస్ట్
ఈ ఘోర ఉదంతంపై తెహ్రీ గర్హ్వాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  శ్వేతా చౌబే స్పందిస్తూ.. నిందితులపై ఐపీసీ హత్య సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2)(వి) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి యశ్‌వీర్ సింగ్ పన్వార్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత!

Advertisement
 
Advertisement
Advertisement