IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే! | Abhishek Nayar Picks India Playing XI vs AFG 1st ODI leaves Out Ishan | Sakshi
Sakshi News home page

IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!

Jun 9 2026 4:09 PM | Updated on Jun 9 2026 4:16 PM

Abhishek Nayar Picks India Playing XI vs AFG 1st ODI leaves Out Ishan

అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్‌పూర్‌ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్‌ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో ఈ మ్యాచ్‌ భాగం కాదు.

కాబట్టి అఫ్గన్‌తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్‌ మాత్రం దొరికింది. మానవ్‌ సుతార్‌ (లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.

మూడు వన్డేలు
ఇదిలా ఉంటే.. జూన్‌ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్‌ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

మరోవైపు.. ఇషాన్‌ కిషన్‌ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ సాధించారు. దీంతో అఫ్గన్‌తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.

ఇషాన్‌ వద్దు.. 
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌కు బదులు యశస్వి జైస్వాల్‌కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.

స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్‌తో వన్డేలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేస్తాడు. యశస్వి జైస్వాల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు, కేఎల్‌ రాహుల్‌ ఐదు, హార్దిక్‌ పాండ్యా ఆరు, వాషింగ్టన్‌ సుందర్‌ ఏడు, హర్ష్‌ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.

పేస్‌ దళంలో అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు గుర్నూర్‌ బ్రార్‌ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్‌ నాయర్‌ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటు ఇవ్వలేదు.

జైసూను ఆడిస్తారా?
ఐపీఎల్‌-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా.. 16 మ్యాచ్‌లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్‌ కిషన్‌ 602 పరుగులతో దుమ్ములేపాడు.

అంతేకాదు సీజన్‌ ఆరంభంలో ప్యాట్‌ కమిన్స్‌ గైర్హాజరీలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్‌. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఇషాన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్‌ నాయర్‌ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.

అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేకు అభిషేక్‌ నాయర్‌ ఎంచుకున్న జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్ష్‌ దూబే, అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌, కుల్దీప్‌ యాదవ్‌.

చదవండి: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

Advertisement
 
Advertisement
Advertisement