BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ | BCCI Removes Siraj From India T20I Squad Vs IRE ENG Check Replacement | Sakshi
Sakshi News home page

BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ.. కీలక ప్రకటన

Jun 9 2026 2:49 PM | Updated on Jun 9 2026 3:06 PM

BCCI Removes Siraj From India T20I Squad Vs IRE ENG Check Replacement

సిరాజ్‌ (PC: BCCI)

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో
కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్‌ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్‌లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్‌గా నియమించింది.

ఇక శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో టీమిండియా జూన్‌ 26 నుంచి ఐర్లాండ్‌లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. 

వైభవ్‌ సూర్యవంశీకి చోటు
ఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.

అందుకే సిరాజ్‌ను తప్పిస్తు న్నాం
తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్‌కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.

సిరాజ్‌ స్థానంలో ప్రసిద్‌ కృష్ణను సీనియర్‌ మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్‌కు బదులు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లలో అతడు టీ20 సిరీస్‌లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. 

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌కు టీమిండియా (అప్‌డేటెడ్‌)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌, వైభవ్‌ సూర్యవంశీ, ప్రసిద్‌ కృష్ణ.

చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు!

Advertisement
 
Advertisement
Advertisement