PC: BCCI X
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నలు సంధించాడు. కాస్త ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసిన ప్రతీసారీ అతడి కండరాలు పట్టేయడం శుభసూచకం కాదన్నాడు. ఇంగ్లండ్తో మొదటి, మూడో వన్డేలో 70 పరుగులు చేసిన తర్వాత గిల్ ఇబ్బంది పడ్డ తీరు జట్టుకు ఎంతమాత్రం మంచిది కాదని బ్రాడ్ పేర్కొన్నాడు.
అసహనం వ్యక్తం చేసిన గిల్
కాగా టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల పాలవుతుండటంపై శుబ్మన్ గిల్ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండు, మూడు మ్యాచ్లకు ఒకసారి గాయాలతో అందుబాటులో లేకుండా పోతే... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లో ఎలా ఆడతారని ప్రశ్నించాడు.
ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆడిన మూడు సిరీస్ల్లోనూ భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఇంగ్లండ్తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ సారథ్యంలోని టీమిండియా 27 పరుగుల తేడాతో ఓడింది.
మోకాలి గాయం కారణంగా ఆఖరి వన్డేకు పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోగా... పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. దీంతో టీమిండియా ముందు రికార్డు లక్ష్యం నిలిచింది.
ఛేదనలో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ సూపర్ సెంచరీకి గిల్, కోహ్లి అర్ధశతకాలు తోడవడంతో ఒక దశలో భారత్ గెలుస్తుందనిపించినా... మిగిలిన ప్లేయర్లు చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు.
గాయాల బెడద
ఈ సిరీస్ ప్రారంభానికి ముందే పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయాలతో జట్టుకు దూరం కాగా... హర్షిత్ రాణా టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో మ్యాచ్లో గాయపడగా... మోకాలి గాయంతో బుమ్రా మూడో మ్యాచ్ ఆడలేదు.
ఈ నేపథ్యంలో లార్డ్స్లో ఓటమి అనంతరం గిల్ మాట్లాడుతూ... ‘ముందు ప్రకటించిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు చివరి మ్యాచ్ ఆడలేదు. ఒక ఆటగాడు గాయపడితే... ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇద్దరు అందుబాటులో లేకపోతే జట్టు కూర్పును మార్చుకోవచ్చు.
దీనికి మందు కనిపెట్టాలి
కానీ ప్రతి మ్యాచ్ తర్వాత ఎవరో ఒకరు గాయపడుతుంటే... జట్టు సమతుల్యత దెబ్బతింటుంది. దీనికి మందు కనిపెట్టాలి. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుంటే... అక్కడి వరుసగా పది, పదకొండు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
ఇలా ప్రతి రెండు మ్యాచ్లకు గాయపడితే... మెగా టోర్నీలో ఎలా ఆడగలం. మ్యాచ్ రోజు ఉదయం వచ్చి నేను ఆడలేను అని అంటే వ్యూహాలు ఎలా అమలు చేయగలం’ అని అన్నాడు.
వ్యక్తిగతంగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా... ఇటీవలి కాలంలో తరచూ గాయపడుతున్న ప్లేయర్లను ఉద్దేశించే గిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవతుంది. ఇదిలా ఉంటే... ఇటీవలి కాలంలో గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తరచూ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
డెబ్బై పరుగులు చేస్తాడు.. కండరాలు పట్టేస్తాయి
ఈ నేపథ్యంలోనే స్టువర్ట్ బ్రాడ్ గిల్ ఫిట్నెస్ సమస్యల గురించి తాజాగా విమర్శించాడు. ‘‘ప్రతిసారీ అతడు 70 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కండరాల నొప్పితో విలవిల్లాడుతున్నాడు.
ఇంగ్లండ్తో తొలి, మూడో వన్డేలో అతడు ఇలాగే రిథమ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు’’ అని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన శుబ్మన్ గిల్.. మూడో వన్డేలో 77 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.


