ఒక కేసులో సజ్జన్‌కు విముక్తి | 1984 Anti-Sikh riots Delhi court acquits Sajjan Kumar | Sakshi
Sakshi News home page

ఒక కేసులో సజ్జన్‌కు విముక్తి

Jan 22 2026 10:49 AM | Updated on Jan 23 2026 6:10 AM

1984 Anti-Sikh riots Delhi court acquits Sajjan Kumar

1984 సిక్కు వ్యతిరేక జనక్‌పురి అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు

సందేహానికి తావులేని రీతిలో ఆధారాల్లేవని జడ్జి వ్యాఖ్య

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది. జనక్‌పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లకు సజ్జన్‌ కుమార్‌ కారణమని సందేహానికి తావులేని రీతిలో నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని పేర్కొంది. బాధితులు, వారి కుటుంబాల ఆవేదనను తాము అర్థం చేసుకోగలమన్న స్పెషల్‌ కోర్టు జడ్జి దిగ్‌ వినయ్‌ సింగ్‌..భావోద్వేగాలకు అతీతంగా తీర్పు ఉండాలంటూ వ్యాఖ్యానించారు.

 ‘ఈ కేసులో నిందితుడి నేరాన్ని కేవలం సాక్ష్యాధారాల ఆధారంగానే నిర్ధారించాలి. దురదృష్టవశాత్తూ సాక్షులలో ఎక్కువ మంది విన్న మాటలను చెప్పిన వారు, కనీసం నిందితుడి పేరును చెప్పడంలో విఫలమైన వారు ఉన్నారు’అని జడ్జి పేర్కొన్నారు. ఇటువంటి సాక్షులు నిందితుడిని గుర్తించారన్న అంశంపై ఆధారపడటం ప్రమాదకరం, న్యాయం పక్కదారి పట్టడానికి దారితీయవచ్చునని ఆయన అన్నారు. 

నేరం జరిగిన ప్రాంతంలో సజ్జన్‌ కుమార్‌ ఉన్నాడని లేదా అతడిని అక్కడ ఎవరైనా చూశారని చెప్పడానికి ఎటువంటి నమ్మదగిన సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడిన గుంపును సజ్జన్‌ కుమార్‌ రెచ్చగొట్టినట్లు, ఆ ఘటనకు సంబంధించి ఎటువంటి కుట్ర జరిగినట్లు కూడా ఆధారాలు లేవని 60 పేజీల తీర్పులో తెలిపారు. అందుకే, అతడిని అన్ని ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ నిర్దోషిగా ప్రకటిస్తున్నామని తీర్పు వెలువరించారు. 

సజ్జన్‌ కుమార్‌కు ఇదివరకే ఇటువంటి నేరాలతో ప్రమేయం ఉందన్న వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఒక వ్యక్తి 100 నేరాలలో దోషిగా తేలి ఉండవచ్చు, కానీ 101వ నేరంలో కూడా అతడిని దోషిగా నిర్ధారించాలంటే సందేహానికి తావు లేని బలమైన సాక్ష్యం కచ్చితంగా ఉండాలన్నారు. ఇక్కడ అనుమానాలకు తావుండరాదని తెలిపారు. నిందితుడు సామాన్యుడైనా లేదా పలుకుబడి కలిగిన వ్యక్తయినా చట్టం అందరికీ సమానమేనన్నారు.

 ‘నిందితుడికి భయపడే పరిస్థితులు తగ్గినప్పటికీ, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన, ఆ ఘటనను స్వయంగా చూసిన సాక్షులు, ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా నిందితుడి పేరును చెప్పడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పడానికి తగిన కారణం ఏదీ కనిపించడం లేదు’అని జడ్జి దిగ్‌ వినయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక వేదన అర్థం చేసుకోగలం. కానీ, ఆ వేదన ఈ కోర్టు నిర్ణయానికి అడ్డంకి కాకూడదు. ఈ నిర్ణయం భావోద్వేగాలకు అతీతంగా ఉండాలి’అని ఆయన తెలిపారు. 

1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అంగరక్షకుల కాల్పుల్లో చనిపోవడంతో ఢిల్లీలో సిక్కులపై దాడులు జరిగాయి. ఢిల్లీలోని జనక్‌పురి, వికాస్‌పురి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన అల్లర్లకు అప్పటి ఔటర్‌ ఢిల్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న సజ్జన్‌ కుమార్‌ కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. వికాస్‌పురి కేసులో కోర్టు ఇప్పటికీ ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, సరస్వతీ విహార్‌ ప్రాంతంలో అల్లర్ల సమయంలో జరిగిన హత్యల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు గతేడాది సజ్జన్‌ కుమార్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. దీంతో, ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

బాధిత కుటుంబాల తీవ్ర ఆవేదన
1984 అల్లర్ల కేసు తీర్పు వెలువడుతుందన్న విషయం తెలిసిన బాధితులు, వారి కుటుంబీకులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు తరలివచ్చారు. సజ్జన్‌ కుమార్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేనందున, ఆయన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించగా వారంతా షాక్‌కు గురయ్యారు. ‘దుండగులు నిప్పంటించడంతో మా నాన్న నా కళ్లెదుటే మంటలకు ఆహుతయ్యారు. కోర్టుల చుట్టూ తిరిగా. న్యాయం జరుగుతుందని 42 ఏళ్లపాటు ఎదురు చూశా. దశాబ్దాల తరబడి ఆశతో ఎదురుచూసినా, ఇప్పటికీ న్యాయం అందనంత దూరంలోనే ఉంది’అని నిర్మల్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement