ఢిల్లీ: దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను ప్రధాని ప్రారంభించారు. 12.3 కిలో మీటర్ల పొడవు కలిగిన మజ్లిస్ పార్క్-మౌజ్పూర్-బాబర్పూర్ (పింక్లైన్), 9.9 కిలోమీటర్ల దూరం విస్తరించిన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ (మజెంటా లైన్) కారిడార్లను మోదీ ప్రారంభించారు.
మజ్లిస్ పార్క్ - మౌజ్పూర్ - బాబర్పూర్ కారిడార్.. ఈ కారిడార్లో ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మజ్లిస్ పార్క్ - శివ్ విహార్ పింక్ లైన్లో భాగంగా ఉంటుంది. ఈ కొత్త మార్గంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71.56 కిలోమీటర్లు. దీంతో ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి 'రింగ్ మెట్రో'గా అవతరించింది. మజ్లిస్ పార్క్, బురారీ, జరోడా మజ్రా, జగత్పూర్-వజీరాబాద్, సూర్ఘాట్, నానక్సర్-సోనియా విహార్, ఖజూరీ ఖాస్, భజన్పురా, యమునా విహార్, మౌజ్పూర్-బాబర్పూర్ స్టేషన్లు ఉన్నాయి.
ఈ మార్గంలో యమునా నదిపై కొత్త వంతెన, మెట్రో లైన్, రోడ్డు ఫ్లైఓవర్ రెండూ ఉండేలా నిర్మించిన 'డబుల్ డెక్కర్ వయాడక్ట్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపాలి చౌక్ - మజ్లిస్ పార్క్ కారిడార్.. ఇది బొటానికల్ గార్డెన్ - కృష్ణా పార్క్ ఎక్స్టెన్షన్ మెజెంటా లైన్కు ఎలివేటెడ్ పొడిగింపు. ఇందులో ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఈ కారిడార్ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు.. దీపాలి చౌక్, మధుబన్ చౌక్, ఉత్తర పితాంపుర-ప్రశాంత్ విహార్, హైడర్పూర్ విలేజ్, హైడర్పూర్ బాద్లీ మోర్, భల్స్వా, మజ్లిస్ పార్క్ స్టేషన్లు ఉన్నాయి. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ కారిడార్ 28.36 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత ఎత్తైనది. వీటితోపాటు మరో మూడు కొత్త కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.


