జార్ఖండ్లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్దిసేపటికే మృతిచెందిన పసికందును ఆసుపత్రి వర్గాలు అంబులెన్స్లో తరలించడానికి నిరాకరించాయి. దీంతో ఆ పాప మృతదేహాన్ని తండ్రి చేతపట్టుకొని 20 కిలోమీటర్ల వరకూ నడుస్తూ తీసుకెళ్లాడు. ఈ ఘటన పలువురిని ఆవేదనకు గురిచేసింది.
పశ్చిమ సింగ్ఫూమ్, బాంగ్రాసాయ్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి గర్భిణీ అయిన తన భార్యను చక్రధర్ పుర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం రోజు ఆ మహిళ ప్రసవించింది. అయితే కొద్దిసేపటికే ఆ పాప మృతిచెందింది. అయితే ఆ వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందిగా అతనిపై ఒత్తిడి తెచ్చారు. అయితే దానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా సదరు సిబ్బంది కోరగా వారు నిరాకరించారు.
అయితే పేదరికం రీత్యా ఇతర వాహనాన్ని ఏర్పాటు చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఆ పసికందు మృతదేహాన్ని తన తండ్రి ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్లాడు. 20 కిలోమీటర్ల దూరం ఉన్న తన ఇంటికి నడుస్తూ వెళ్లాడు. ఈ బాధాకర సన్నివేశం అక్కడున్న వారిని ఆవేదనకు గురి చేసింది. అయితే డెలివరీ సమయంలోనూ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
కాగా ఈ ఘటనపై ఆసుపత్రి డాక్టర్ అనుష్మాన్ శర్మ భిన్నంగా స్పందించారు. అంబులెన్స్ కావాలని ఆ పాప తండ్రి గాని బంధువులు గానీ తమను సంప్రదించలేదని ఒకవేళ సంప్రదిస్తే తప్పనిరిగా అంబులెన్స్ ఏర్పాటు చేసేవారిమని డాక్టర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది.


