సాక్షి,కామారెడ్డి: ముగ్గురు చిన్నారుల అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. పెంచలేక తన కుమార్తెలను చెరువులోకి తోసేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి ఆర్బీ నగర్కు చెందిన ఇస్మాయిల్,షబీనా దంపతులు. వారికి షీపత్(8), ఆయత్ (7), మరియం(5) కుమార్తెలు. ఇస్మాయిల్ ఆటో నడుపుతుండగా.. షబీనా కూలి పనులకు వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు.
అయితే, ఇటీవల ఇస్మాయిల్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రూ.5లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి, మరోవైపు పిల్లల్ని పెంచడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ దారుణానికి ఒడిగట్టాడు. పిల్లల్ని పెంచలేక స్థానిక చెరువులో తోసేశాడు. ప్రాణాలు పోయాయా? లేవా? అని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే ఉన్నాడు.
పిల్లల అదృశ్యంపై ఇస్మాయిల్ భార్య షబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. తండ్రి ఇస్మాయిల్ను సైతం ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో తండ్రి ఇస్మాయిల్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. విచారణలో కుమార్తెలను తాను ప్రాణం తీసినట్లు అంగీకరించాడు. చెరువులో నుంచి పిల్లల్ని వెలికి తీశారు.


