హైదరాబాద్: ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరు మృతికి కారణమైన నిందితుడికి బంజారాహిల్స్ పోలీసులు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... 2016 జూలై ఒకటిన రమ్య(9) అనే విద్యారి్థనిని పాఠశాల నుంచి తీసుకొని ఆమె బాబాయి పి.రాజేష్, తాత మధుసూదనాచారిలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3 నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తున్నారు.
అదే సమయంలో సినీమ్యాక్స్ భవనంలోని టీజీఐ ఫ్రైడ్ పబ్లో అతిగా మద్యం తాగిన ఆర్.శ్రావిల్, కచ్చా విష్ణువినీత్ల కారు బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్ పంజగుట్ట వైపు అతివేగంగా దూసుకువచ్చింది. శ్రావిల్ నడుపుతున్న ఈ కారు అదుపుతప్పి పంజగుట్ట శ్మశానవాటిక సమీపంలోని డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు రమ్య ఉన్న కారుపై పడింది.
ఈ ప్రమాదంలో రమ్య, మధుసూదనాచారి, రాజేష్లు మృతి చెందారు. ఈ మేరకు ఏ1 శ్రావిల్, ఏ2 విష్ణువినీత్లపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు నడుస్తుండగానే విష్ణువినీత్ అమెరికా వెళ్లాడు. ఈ నెల 17న నాంపల్లి సెషన్స్ కోర్టులో ఈ కేసు వాయిదా ఉండటంతో పోలీసులు సాక్షుల విచారణ చేపట్టారు. నిందితులను కూడా హాజరుపర్చేందుకుగాను అమెరికా నుంచి విష్ణువినీత్ను రప్పించేందుకు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు.


