డొమెస్టిక్ సిలిండర్పై రూ.60, కమర్షియల్కు రూ.114.50 పెంపు
రాష్ట్రంలో సిలిండర్ ధర రూ.905 నుంచి రూ. 965కు..
కమర్షియల్ గ్యాస్ పెంపుతో హోటళ్లలో ధరలు పెరిగే సూచనలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ (ఎలీ్పజీ), కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.114.50 పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. రాష్ట్రంలో ఇదే సిలిండర్ ధర రూ. 905 నుంచి 965కు చేరుకుందని ఆయిల్ కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా ఖర్చులను బట్టి మారనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు గృహ బడ్జెట్పై మరింత ఒత్తిడి పెంచనుంది.
కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంపు
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం ఏకంగా రూ.114.50 పెంచింది. దీంతో ఢిల్లీలో ధర రూ.1,883కు చేరగా, హైదరాబాద్లో సుమారు రూ.2వేల వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మార్చి 1న కమర్షియల్ సిలిండర్పై రూ.28 పెంచారు. తాజా పెంపుతో ఈ ఏడాది ప్రారంభం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర మొత్తం రూ.300కు పైగా పెరిగినట్లయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్ల నిర్వహణ ఖర్చులు పెరగనున్నాయి. ఫలితంగా టీ నుంచి భోజనం వరకు, ఇతర అన్ని తినుబండారాల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్ల వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
‘మహాలక్ష్మి’కి ఊరట?
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 సబ్సిడీ కింద ఏటా ఆరు సిలిండర్లను ప్రభుత్వం పేదలకు అందిస్తోంది. అయితే పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ పథకం కింద ఏడాదికి రూ. 740 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. పెరిగిన ధర కూడా ప్రభుత్వం భరించే పక్షంలో ఖజానాపై ఈ భారం మరింత పెరుగుతుంది. కాగా, ప్రస్తుతం పెట్రో ల్, డీజిల్ ధరలను పెంచే యోచన లేదని కేంద్రంచెబుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎక్కువకాలం అధికంగా కొనసాగితే వాటి ధరల పెంపు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.


