ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి.. | Spiritual And Sannidi Story Written By Dr Panyam Vasundhara | Sakshi
Sakshi News home page

ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి..

Jul 9 2026 7:59 AM | Updated on Jul 9 2026 9:11 AM

Spiritual And Sannidi Story Written By Dr Panyam Vasundhara

హితవాక్యం

నం మాట్లాడే మాటల శబ్దాలు మనపైన, ప్రకృతిపైన ప్రభావం చూపుతాయి. అవే శబ్దాలు వేద మంత్రాలకు సంబంధించినవైతే మరింత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. అశుద్ధమైన మాటలు వినడం, చెడు దృశ్యాలు చూడటం వంటివి మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. ప్రియమైన మాటలు మాట్లాడితే సకల ప్రాణులూ ఆనందిస్తాయి. ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి. వినయ పూర్వక సత్య వచనాలు పలకడం ద్వారానే బంధువులు, స్నేహితులు దగ్గర అవుతారు. అలా మాట్లాడ గలిగే వారు సంఘంలో రాణిస్తారు.

తైత్తిరీయారణ్యకం ‘మనో వాక్కాయ కర్మాణి శుధ్యన్తామ్‌’ అని చెప్పింది. అంటే మనస్సు, మాట, పనులను (త్రికరణములు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరుల మనసులు గాయపరుస్తూ, బాధించేలా మాట్లాడకూడదు. అలా చేయడం కూడా హింసే అన్నారు గాంధీజీ. మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి. ‘మధుర భాషణమున మర్యాదప్రాప్తించు’ అన్నారు పెద్దలు. మంచి మాట ఆభరణమే కాదు, దివ్యశక్తి కూడా! దానిని మనం మితంగా, జాగ్రత్తగా వినియోగించాలి. రఘువంశపు రాజులందరూ ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాస మహాకవి అన్నారు. అంటే సత్య సంరక్షణార్థం ఆ రాజులు మిత భాషిత్వాన్ని పాటించారని అర్థం.

మనిషికి నాలుక ముందు పుట్టి తర్వాత దంతాలు ఏర్పడుతాయి. కానీ నాలుక కంటే  వెనుక పుట్టిన దంతాలే ముందుగా ఎందుకు ఊడిపోతాయి అనే ప్రశ్నకు శ్రీ రామకృష్ణ పరమహంస చక్కని వివరణ ఇచ్చారు. ‘దంతాలు కఠినంగా ఉంటాయి. వాటికి వినయంతో కూడిన మెత్తదనం లేదు. నాలుక మృదువుగా అణకువతో ఉండి త్వరగా బయటకు కనపడదు. అందుకే రెండు పలు వరుసల మధ్య అది సురక్షితంగా ఉంటుంది’ అన్నారాయన. వినయంతో మిత భాషులైనవారు సురక్షితంగా ఉంటారు. కఠినాత్ములు, పరుష వాక్కు గల వారు త్వరగా రాలిపోతారని అర్థం చేసుకోవాలి.

మన మాటల వలన జనించే శబ్దం చాలా శక్తిమంతమైనది. అవి వినేవారి మనస్సు పైన, దేహం పైనా అపరిమిత ప్రభావాన్ని చూపుతుంది. దుఃఖిస్తున్న వారి పట్ల దయతో సాంత్వన వచనాలు పలికితే వారి శోకం ఉపశమిస్తుంది. ఎవరి పట్లనైనా పరుష పదాలతో కఠినంగా మాట్లాడితే అవతలి వారు కోపోద్రిక్తులై పరిస్థితి విషమిస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు మధురంగా... హితంగా.. మితంగా మాట్లాడటమే మంచిదని పెద్దలు చెప్పారు.

మాట్లాడ గలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి.
– డాక్టర్‌ పాణ్యం వసుంధర

  • నిర్వహణ డి.వి.ఆర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement