తిరువనంతపురం: కేరళ హైకోర్ట్.. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల మదింపులో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేటీ శంకరన్కు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించింది. అయ్యప్పస్వామికి సంబంధించిన బంగారు కానుకలతో పాటు ఇతర విలువైన వస్తువులను 80 బస్తాలలో నిల్వ ఉంచిన నేపథ్యంలో వాటి లెక్కింపుకు సహకరించాలని కోర్టు తెలిపింది.
భవిష్యత్తులో స్వీకరించే విలువైన కానుకలను సురక్షితంగా భద్రపరచడానికి అనుసరించబోయే విధానం గురించి సైతం తమకు ఖచ్చితంగా తెలియజేయాలని బోర్డు స్టాండింగ్ కౌన్సిల్కు ఆదేశాలిచ్చింది. అటువంటి కానుకలను క్రమానుగతంగా మదింపు చేసి, సమగ్రమైన డిజిటల్ ఇన్వెంటరీ ద్వారా నమోదు చేయడమే దీని ఉద్దేశమని తెలిపింది. ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్న సమయంలో జస్టిస్ వి.రాజా విజయ రాఘవన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసును తదుపరి విచారణ కోసం కోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది .
ఆరన్ముళ స్ట్రాంగ్ రూమ్లో 'కనిపొన్ను' అని లేబుల్ చేసి 80 సంచులలో వీటిని నిల్వ ఉంచారు. శబరిమల ఆలయ తిరువాభరణం రిజిస్టర్లో నమోదైన అన్ని వస్తువులతో పాటు, ఆరన్ముళ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన విలువైన వస్తువుల సమగ్ర మదింపును చేపట్టేందుకు, జస్టిస్ కేటీ శంకరన్ను హైకోర్టు 2025 సెప్టెంబర్ 29 న నియమించింది . ప్రత్యేక కమిషనర్ నివేదిక ప్రకారం, మదింపు ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావస్తోంది.
అయితే, జూలై 4న నిర్వహించిన తనిఖీలో'కనిపొన్ను' అని గుర్తించబడిన 80 సంచులలో బంగారం, వెండి కానుకలు మాత్రమే కాకుండా అనేక ఇతర సామగ్రి కూడా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. విలువైన వస్తువుల నుండి విలువ లేని వస్తువులను ముందుగా వేరు చేస్తే తప్ప, ఆ విలువైన వస్తువుల సరైన విలువను నిర్ధారించడం సాధ్యం కాదని నివేదిక పేర్కొంది.
అయితే ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు హామీ ఇచ్చిన నేపథ్యంలో సంచులలోని వస్తువులను వేరు చేయడం వాటిలో ఉన్న విలువైన వస్తువుల విలువను అంచనా వేయడం రెండింటికీ సహకరించాలని బోర్డును ఆదేశించింది.
శబరిమల ఆలయానికి వచ్చే విలువైన వస్తువుల కోసం ఒక క్రమబద్ధమైన, డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడే జాబితా వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా , భక్తులు సమర్పించే కానుకల నమోదు మరియు భద్రతను బలోపేతం చేయడానికి కోర్టు ఆదేశాలు దోహదపడతాయని అంతా భావిస్తున్నారు.


