నాటో నాయకులకు అందించిన తుర్కియే
అంకారా: వేడుక ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. ఈ తీరు ఒక్క సంప్రదాయ వేడుకలు, మన దేశానికే పరిమితం కాలేదనిపిస్తోంది ఈ తాజా ఘటన చూస్తే. ఇటీవల నాటో శిఖరాగ్ర సమావేశానికి తుర్కియే ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి హాజరైన వివిధ దేశాధినేతలకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్. సమావేశం ముగిసి వెళ్లేముందు అసాధారణమైన వీడ్కోలు బహుమతి ఇచ్చాడు. సమావేశం నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోవడం నాయకుల వంతయ్యింది.
ఇంతకీ గిఫ్ట్ బ్యాగ్లోని చెక్క పెట్టెలో ఉన్న క్లాసిక్ రివాల్వర్. ఉత్తి తుపాకీ మాత్రమే కాదు.. దాంతోపాటు ఆరు బులెట్లు మెరిసిపోతూ కనిపించాయి. టర్కీ జెండా, నాటో లోగోతో పాటు, టర్కిష్, ఇంగ్లిష్ భాషల్లో ‘గుముసే, మా దేశంలో తయారైన మొట్టమొదటి రివాల్వర్ తరహా హ్యాండ్గన్’అని రాసిన ఫలకాన్ని ఉంచారు. తుర్కియే ఆయుధ తయారీ సంస్థ ఎమ్కేఈ ఉత్పత్తి చేసిన అరుదైన సిక్స్–షూటర్ అయిన గుముసే–357 మ్యాగ్నమ్ రివాల్వర్ అది. దానిపై నాయకుల పేర్లను కూడా చెక్కారు. బెల్జియం ప్రధానమంత్రి, లిథువేనియా అధ్యక్షుడు, స్పానిష్ ప్రధాని సహా పలువురు నాయకుల కార్యాలయాలు ఆయా ఫొటోలను పంచుకున్నాయి.
తక్కువ ధరకే ఆధునియక హ్యాండ్గన్
ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఆయుధాలను తయారుచేస్తున్న దేశాలలో తుర్కియే ఒకటి. తక్కువ ధరకే అంతర్జాతీయ ప్రమాణాలు, అద్భుతమైన పనితీరు కలిగిన ఆధునిక హ్యాండ్గన్ తయారు చేయడంలో ఈ దేశం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ దేశం తొలినాళ్లలో తయారు చేసిన రివాల్వర్ టైప్ హ్యాండ్గన్ ‘గుముసే’అరుదైనది. 2019, 2024 మధ్యకాలంలో అమెరికా, ఇటలీల తర్వాత తుర్కియే ప్రపంచంలో మూడవ అతిపెద్ద చిన్న ఆయుధాల ఎగుమతిదారుగా నిలిచింది.
మ్యూజియాలకు చేర్చిన నాయకులు
బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్, తన రివాల్వర్ను ఒక సేఫ్లో భద్రపరచడానికి బ్రస్సెల్స్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ రివాల్వర్ వార్సా విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఉంది. డచ్, స్వీడిష్ ప్రధానమంత్రుల కార్యాలయాలు తమ రివాల్వర్లను తుర్కియే రాజధాని అంకారాలోని వారి వారి రాయబార కార్యాలయాలకు తీసుకెళ్లాయి. బ్రిటన్కు తుపాకీతో పాటు క్లీనింగ్ కిట్, 500 తూటాలు కూడా వచ్చాయి. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రివాల్వర్ను ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన పలాజో చిగీలో ఇతర ప్రభుత్వ బహుమతులతో పాటు భద్రపరిచారు. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లేయన్, తనకు కానుకగా వచ్చిన తుపాకీని సైనిక మ్యూజియానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రీస్ కానుకను ఏథెన్స్లోని యుద్ధ మ్యూజియంలో ఉంచాలనుకుంటోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, రివాల్వర్ను జాతీయ యుద్ధ మ్యూజియానికి చేర్చారు.


