ఇరాన్తో ఒప్పందం ముగిసింది
కాల్పుల విరమణ ముగిసిపోయినట్లే..
పద్ధతి మార్చుకోకపోతే తీవ్రస్థాయిలో దాడులు తప్పవు
మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తాం
ఖర్గ్ ఐలాండ్ను స్వా«దీనం చేసుకుంటాం
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
అంకారా: పశ్చిమాసియాలో సంఘర్షణను ముగించడానికి ఇరాన్తో కుదుర్చుకున్న మధ్యంతర శాంతి ఒప్పందం.. తద్వారా కాల్పులు విరమణ ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. బుధవారం తుర్కియేలోని అంకారాలో నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్ నాయకులను ‘నీచులు, రోగులు’గా అభివర్ణించారు. ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవడానికి తాను ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. ఇరాన్తో మూడు వారాల క్రితం సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ముగిసిందని పేర్కొన్నారు.
ఇకపై వాళ్లతో(ఇరాన్) ఒప్పందాలు చేసుకోవాలని ఎంతమాత్రం అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది కచ్చితంగా తెలియరాలేదు. కానీ, ఇరాన్కు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటన వెంటనే ప్రభావం చూపింది. చమురు ధరలు 5 శాతానికిపైగా పెరిగాయి. యుద్ధాన్ని ముగించడానికి మధ్యంతర ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత అమెరికా, ఇరాన్లు తమ కాల్పుల విరమణను కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నాయి. హార్మూజ్ జలసంధిపై పూర్తిస్థాయిలో పట్టు బిగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండగా, అమెరికా అందుకు అంగీకరించడం లేదు.
బహుశా ఈ రాత్రి కూడా దాడులు!
ఇరాన్ నేతలపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వారు ముమ్మాటికీ నీచులు, రోగగ్రస్తులు, దుర్మార్గులు, హింసాత్మక మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగిస్తారు’’అని ఆక్షేపించారు. అయితే, అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలను కొనసాగించవచ్చని ట్రంప్ సూచించారు. కానీ, ఆ చర్చల్లో ఒరిగేదేమీ ఉండదని, టైమ్ వేస్ట్ అంటూ కొట్టిపారేశారు. పిచ్చివాళ్లతో చర్చలు జరపడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అబద్ధాలకోరులతో చర్చించడం అంటే సమయం వృథా చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదన్నారు.
ఇరాన్పై మళ్లీ దాడులకు అమెరికా సన్నద్ధమవుతోందని ట్రంప్ తెలిపారు. నిన్న రాత్రి వారిపై తీవ్రమైన దాడి చేశామని, బహుశా ఈ రాత్రి కూడా గట్టిగా దాడి చేస్తామని స్పష్టంచేశారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తమ దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్ చాలా దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. హార్మూజ్లో నౌకలపై డ్రోన్లు, క్షిపణిని ప్రయోగించిందని ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తీవ్రస్థాయిలోదాడులకు దిగుతామని ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు.
ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలు ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకుంటామని అన్నారు. అవసరమైతే ఇరాన్కు చెందిన విద్యుత్ కేంద్రాలను, నీటి శుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ చెప్పారు. మంగళవారం ఖర్గ్ ద్వీపంపై దాడులు ఉన్నప్పటికీ అక్కడి చమురు కేంద్రాలపై మాత్రం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘బహుశా మేము ఖర్గ్ ఐలాండ్ను స్వా«దీనం చేసుకోవచ్చు. దాన్ని మేము స్వా«దీనం చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి ఇరాన్ చేయగలిగేది ఏమీ ఉండదు’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. మరోవైపు దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ చమురు అమ్మకాలపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఘర్షణ ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చడం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది.


