సాక్షి,హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటి వద్ద యాదవ సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శివచరణ్ రెడ్డి ఇంటిపై యాదవ సంఘాలకు చెందిన కొందరు దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన ఆయన అనుచరులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
ప్రస్తుతం ఎల్బీ నగర్ ప్రాంతంలో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఘర్షణకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


