బంగారం ధరలు ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయిని తాకిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో భారతీయ కుటుంబాల పసిడి కొనుగోలు ధోరణిలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. సాధారణంగా పాత బంగారు ఆభరణాలను కొత్త నగలుగా మార్చుకునే వినియోగదారులు, ఇప్పుడు వాటిని నేరుగా విక్రయించి నగదుగా మార్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలే ఈ ధోరణికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
3 నెలల్లో 50 టన్నుల బంగారం
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి వచ్చింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం అధికం. పాత ఆభరణాలను అమ్మి నగదు పొందేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర కొన్ని సందర్భాల్లో రూ.1.8 లక్షల వరకు చేరుకోగా, ప్రస్తుతం అది సుమారు రూ.1.4 లక్షల స్థాయికి దిగివచ్చింది. ధరలు ఇంకా రూ.1.2 లక్షల వరకు పడిపోవచ్చనే అంచనాలతో చాలామంది ఇప్పుడే విక్రయించి లాభాలను సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు.
బంగారం అధిక ధరలను నగదుగా మార్చుకునే అవకాశంగా వినియోగదారులు చూస్తున్నారని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. గతంలో పాత నగలను ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే పద్ధతి ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం మాత్రం నేరుగా విక్రయించి నగదు పొందడానికే ప్రాధాన్యం పెరిగిందన్నారు.
రీసైక్లింగ్ పరిశ్రమకు ఊతం
ఈ పరిణామం దేశంలోని సంఘటిత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా ఊతమిస్తోంది. ఇళ్లలో ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారం తిరిగి మార్కెట్లోకి రావడం వల్ల దిగుమతులపై ఆధారపడే అవసరం కొంత మేర తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, అధిక ధరల కారణంగా కొత్త బంగారు ఆభరణాల కొనుగోళ్లు మాత్రం మందగించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


