సాక్షి, అమరావతి: 2026–27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 823 వైద్య కళాశాలల్లో 1,36,939 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ప్రకటించింది. వీటిలో 441 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా, వాటిలో 63,296 సీట్లు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు 2026–27 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ను ఎన్ఎంసీ విడుదల చేసింది. ఏపీలో 19 ప్రభుత్వ, 21 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 7,465 సీట్లు ఉన్నాయి. పక్కనున్న తెలంగాణలో 66 కళాశాలల్లో 10,250 సీట్లు ఉన్నాయి.
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఎన్ఎంసీ పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఈ క్రమంలో పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. వాస్తవానికి గతేడాదే పాడేరు కళాశాలకు 50 సీట్లు అదనంగా మంజూరయ్యాయి. ఇక పిడుగురాళ్లకు 100 సీట్లు మంజూరైనట్టు ఇటీవలే ఎన్ఎంసీ లేటర్ ఆఫ్ పర్మిషన్(ఎన్ఎంసీ) ఇచ్చింది. అయితే సీట్ మ్యాట్రిక్స్లో మాత్రం 50 చొప్పున మాత్రమే చూపించడంతో ఎన్ఎంసీతో సంప్రదింపులు జరిపామని డీఎంఈ కార్యాలయ అధికారులు తెలిపారు. సీట్ల వివరాల నమోదులో పొరపాటు జరిగిందని ఎన్ఎంసీ స్పష్టం చేసినట్టు సమాచారం.


