కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న గ్రామస్తులు
పెన్నానది నుంచి భారీఎత్తున యథేచ్ఛగా అక్రమ రవాణా
అభివృద్ధి పనుల ముసుగులో తరలిస్తున్న అమిలినేని కంపెనీ ఎస్ఆర్సీ
ఇసుక టిప్పర్లను అడ్డుకున్న రాళ్ల అనంతపురం గ్రామస్తులు
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అ«ధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి వనరులను ఇష్టానుసారం దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్(ఎస్ఆర్సీ)ను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ఇసుక దందా సాగిస్తున్నారు. పెన్నానదిలో ఇసుకను భారీఎత్తున తోడేస్తూ కర్ణాటక, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతంలోనూ పలు కాంట్రాక్టు పనులు చేపడుతోంది. ఇందుకోసం కంబదూరు సమీపంలో కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంటు ఏర్పాటు చేసుకుని, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతుండడంతో ఆగ్రహించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామస్తులు మంగళవారం అర్ధరాత్రి ఎస్ఆర్సీకి చెందిన ఐదు ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే సురేంద్రబాబు అధికార బలంతో పెన్నాలో రెండేళ్లుగా ఇసుకను కొల్లగొడుతున్నారని, దీనివల్ల తాము సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపై మండల తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని వాపోయారు. గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


