మల్లప్ప కొండపై తమిళనాడువాసి దారుణ హత్య
కుప్పం: ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ పథకం ప్రకారం భర్తను కడతేర్చిన ఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని మల్లప్ప కొండపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. శాంతిపురం మండలం బోయనపల్లికి చెందిన ఓ మహిళతో, తమిళనాడు సూళగిరికి చెందిన రమేష్ కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న చిన్నారి ఉంది. రమేష్ భార్య వారం కిందట సూలగిరి నుంచి బోయనపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది.
భార్య, బిడ్డను చూసేందుకు మంగళవారం అత్తారింటికి వెళ్లిన రమేష్ .. అక్కడి నుంచి భార్య, బిడ్డతో కలిసి ద్విచక్రవాహనంపై గుడుపల్లె మండలం మల్లప్ప కొండపై ఉన్న మల్లేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం కొండ దిగుతుండగా మూడో క్రాస్ వద్ద రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. రమేష్ భార్య తన ప్రియుడితో కలిసి పరారవుతున్న దృశ్యాలను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడుపల్లె పోలీసులు తెలిపారు.


