చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్ర శిక్ష శాఖ అకౌంట్స్ ఆఫీసర్గా మోషే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ సంచాలకులు పద్మజ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న పలువురు సబ్ ట్రెజరీ అధికారులకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లుగా ఉద్యో గోన్నతి కల్పించారు. వారిని సమగ్ర శిక్ష శాఖ పరిధిలో పనిచేసేందుకు డిప్యుటేషన్ ప్రాతిపదికన జిల్లాకు కేటాయించారు. నెల్లూరు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న డి.మోషే ను చిత్తూరు సమగ్రశిక్ష శాఖ అకౌంట్స్ ఆఫీసర్గా నియమించారు.
డీఈవోగా లక్ష్మీనారాయణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)గా కె.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ప్రస్తుతం కృష్ణా జిల్లా అంగళూరు ప్రభుత్వ డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పూర్తి అదనపు బాధ్యతల ప్రాతిపదికన కొనసాగుతారని తెలిపారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
వరసిద్ధుడికి
రూ.1.83 కోట్ల ఆదాయం
కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి హుండీల ద్వారా రూ.1,83,98,379 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. ఇందులో 49 గ్రాముల బంగారం, 640 గ్రాముల వెండి ఉన్నట్టు తెలిపారు. గోసంరక్షణ హుండీలో రూ.16,165, నిత్యాన్న దానానికి రూ.2,20,830 వచ్చాయన్నారు. విదేశీ కరెన్సీలో అమెరికా 2,373 డాలర్లు, యూఏఈ 625 దిర్హామ్స్, కెనడా 65 డాలర్లు, సౌదీ 60 రియాల్స్, సింగపూర్ 12 డాలర్లు, ఆస్ట్రేలియా 5 డాలర్లు, మలేషియా 3 రింగిట్లు ఉన్నట్టు తెలిపా రు. హుండీలలోని కానుకలను బుధవారం లెక్కించినట్టు తెలిపారు.
బీసీ–బీ ఉపకులాలను
ఓబీసీలో చేర్చాలని వినతి
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలో బీసీ–బీ కింద ఉన్న ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామికి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో బీసీ–బీ ఉప కులాలకు చెందిన వారు నీట్, ఇతర పరీక్షలు, ఉద్యోగ ఎంపికల్లో రిజర్వేషన్ అమలు కావడం లేదని తెలిపారు. 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ జాబితాలోని 21 ఉప కులాలకు రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. వీరికి రాష్ట్రంలో మాత్రమే రిజర్వేషన్ అమలవుతోందన్నా రు. వక్కలిగతో పాటు కురాకుల, పొందారా, సమంతల, పాలేకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయని, పాలెగారు, తొలగరి, కావలి, నగరాలు, అయ్యరక తదితర ఉపకులాల వారికి రిజర్వేషన్ అమలు కోసం ఓబీసీ జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు.
హెచ్ఎంలకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు మండలా ల్లో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టుల్లో హెచ్ఎంల కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 30న పలువురు ఎంఈఓలు పదవీ విరమణ పొందడం, ఒకరు సెలవుపై వెళ్లడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. పరిపాలనా సౌల భ్యం కోసం తాత్కాలిక నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. బైరెడ్డిపల్లి మండలం ఎంఈవో–2గా బైరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్ (బాలికలు) హెచ్ఎం దేశమ్మ, పలమనేరు ఎంఈవో–2గా పలమనేరు బాలికల హైస్కూల్ హెచ్ఎం సుజాత, పూతలపట్టు ఎంఈవో–2గా తలపులపల్లె జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఈశ్వరప్రసాద్, విజయపురం ఎంఈవో–2గా శ్రీహరిపురం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు, నిండ్ర ఎంఈవోగా నగరి ఎంఈవో–1 శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు.


