చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని సుందరయ్య వీధిలో ఉన్న రెండు లాడ్జీల్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. మంగళవారం వన్టౌన్ సీఐ చినపెద్దయ్య, సిబ్బందితో కలిసి పలు లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించారు. తొమ్మిది మంది మహిళలను అదుపులోకి తీసుకునిపునరావాస కేంద్రాలకు తరలించారు. లాడ్జీల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో
నిందితుడి అరెస్ట్
బంగారుపాళెం: హత్య కేసులో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. మహారాష్టలోని నాగ్పూర్కు చెందిన సంతోష్ధర్మాదాస్వర్మ, రోహిత్భాస్కర్ఖడ్గీ, అబ్దుల్హబీబ్రాయిన్ రెండు నెలల క్రితం మామిడికాయల వ్యాపారం నిమిత్తం బంగారుపాళానికి వచ్చారు. తగ్గువారిపల్లెలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ఈనెల 11వ తేదీన సంతోష్ధర్మాదాస్వర్మ తనకు రావలసిన డబ్బుల విషయమై రోహిత్భాస్కర్ఖడ్గీని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఆవేశానికి గురైన రోహిత్భాస్కర్ఖడ్గీ చాకుతో సంతోష్ధర్మాదాస్వర్మ ఛాతీపై పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడి భార్య దివంతిసంతోష్వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడిని బంగారుపాళెం–అరగొండ రహదారి కొత్తపల్లె ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
టీటీడీకి రూ.50 లక్షల విరాళం
తిరుమల: టీటీడీకి మంగళవారం పలువురు దాతలు రూ.50 లక్షలను విరాళంగా అందజేశారు. గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంటర్ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన శ్రీపతి శ్రీనివాస్, కొటారు సునీల్ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నంకు చెందిన చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.
దర్శనం పేరుతో టోకరా
– టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్
తిరుమల: శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వీఐపీ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, తోమాల, సుప్రభాత సేవలు, అతిథి గృహాల్లో వసతి కల్పిస్తానంటూ భక్తులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన టీటీడీ మాజీ ఉద్యోగిని తిరుపతి టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి చేపట్టిన సంయుక్త చర్యల్లో నిందితుడు టి.అరుణ్కుమార్ (26)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం.. తిరుపతికి చెందిన అరుణ్కుమార్ గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసి, విధుల నుంచి తొలగించారు. ఇటీవల బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ.3.2 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. దర్యాప్తులో నిందితుడు ఇదే తరహా మోసాల కేసులో 2023లోనూ అరెస్టయినట్లు పోలీసులు గుర్తించా రు. గత ఏడాది కాలంలో అతని బ్యాంకు ఖాతా ల్లో సుమారు రూ.85 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
ద్విచక్ర వాహనం
ఇవ్వలేదని హత్య
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి శివారుల ఒంటరిగా కూర్చుని మద్యం సేవిస్తున్న ఓ వ్యక్తి దగ్గరకు వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం ఇవ్వాలని కోరారు. వారెవ్వరో తెలియక పోవడంతో ఆ వ్యక్తి ద్విచక్ర వాహనం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు అతనిపై దాడి చేసి చంపేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులతో పాటు హత్య జరిగిన విషయం తెలిసి, చెప్పకుండా దాచిపెట్టిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తిరుపతి అదనపు ఎస్పీ రవిమనోహరాచారి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నెల 9వ తేదీన ఓటేరు వద్ద జరిగిన శ్రీనివాస్ అనే తాపీమేసీ్త్ర హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. హత్య జరిగిన రోజు మృతుడు శ్రీనివాస్ను ఓటేరుకు చెందిన ఉప్పుశెట్టి ఆకాష్, శ్రీనివాసపురానికి చెందిన వాసునూరి రాఘవేంద్ర హత్య చేయడం జరిగిందన్నారు. విషయం తెలిసినా దాచిపెట్టిన మారా టి జయవేలును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
నిందితులు చూపకుండానే ప్రెస్మీట్
నిందితులను మీడియాకు చూపకుండా దాచిపెట్టి వివరాలు మాత్రమే తెలియ పరచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


