వైఎస్ జగన్ను చూడటానికి భారీగా తరలి వచ్చిన రైతులు, ప్రజలు
కిక్కిరిసిన రోడ్లు.. యువత కేరింతలు.. జై జగన్ నినాదాలు
సాక్షి, భీమవరం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం భీమవరం జనసంద్రంగా మారింది. పట్టణంలో రోడ్లన్నీ జనంతో కిక్కిరిశాయి. తమ అభిమాన నేత వైఎస్ జగన్ను దగ్గరి నుంచి చూడాలనే కోరికతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలి వచ్చారు. అడుగడుగునా జనం నిరాజనం పట్టారు. జగన్ కాన్వాయి ప్రయాణించే దారి మొత్తం జనంతో నిండిపోయింది. కేవలం ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయాణానికి గంటకుపైనే సమయం పట్టింది. రాష్ట్రంలోనే భీమవరం ఆక్వా హబ్గా పేరొందింది.
కూటమి పాలనలో సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు అదునుచూసి ఇష్టానుసారం మేత రేట్లు పెంచుతూ, రొయ్య రేట్లు తగ్గిస్తూ రైతుల కష్టాన్ని కాజేస్తున్నాయి. ఈ దోపిడీని అడ్డుకోవాలని మూడు నెలలుగా రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతుల కోసం జగన్ బుధవారం భీమవరం రావడం రైతులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. భీమవరం లూథరన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఉండి బైపాస్ రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలోని సభా ప్రాంగణం వరకు రోడ్డు ఇసుకవేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది.
తాలుకా ఆఫీస్ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్లు జనసంద్రాన్ని తలపించాయి. దారి పొడవునా తన కోసం వేచి ఉన్న వారందరికీ వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సదస్సులో చంద్రబాబు ప్రభుత్వ తీరును ఏకిపారేస్తున్నప్పుడు పెద్ద పెట్టున యువత ఈలలు, కేకలు వేశారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం
జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంలో సర్కారు నిర్లక్ష్యం
రోప్ పార్టీ ఉన్నా జనాన్ని నిలువరించలేక తోపులాట
వలంటీర్లుగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
ఫలితంగా ఆక్వా సదస్సు విజయవంతం
భీమవరం: ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బు«ధవారం భీమవరంలో నిర్వహించిన ముఖాముఖి సమావేశం భద్రత ఏర్పాట్లలో ప్రభుత్వం.. పోలీసు శాఖ ఘోరంగా విఫమైందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పోటెత్తారు. ఇలా భారీగా తరలి వస్తారని ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉన్నా, పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.
ఫలితంగా హెలిప్యాడ్, సభా వేదిక వద్ద రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. భీమవరం పట్టణంలోని లూథరన్ హైసూ్కల్ ఆవరణలో హెలిప్యాడ్ నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా గరగపర్రురోడ్డులోని రైల్వే అండర్పాస్ నుంచి బీవీరాజు కూడలి మీదుగా బైపాస్ రోడ్డులోని సభాస్థలి వరకు జగన్ కారులో వెళతారని ఆయన్ను కళ్లారా చూడాలని దారి పొడవున పెద్ద సంఖ్యలో జనం వేచి చూశారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిన దాఖలాలు కన్పించలేదు.
కనీసం జగన్ వేదిక వద్దకు వచ్చే సమయంలో జనం తోసుకువస్తున్నా రోప్ పార్టీ, తగినంత మంది పోలీసులు లేనందున నిలువరించలేకపోయారు. దీంతో వైఎస్ జగన్ ముందుకు పడబోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు అప్రమత్తమై పట్టుకున్నారు. వేదిక ముందు రైతులు, ప్రజల కోసం ఏర్పాట్లు చేసినా పోలీసుల భద్రత వైఫల్యం కారణంగా తోపులాట చోటుచేసుకుంది. అయితే వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆక్వా సదస్సు విజయవంతమైంది.


