దేశీయ ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్, సాంకేతికత ఆధారిత వ్యాపార నమూనాలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఖాతాదారుల ఆర్థిక సమాచారం (డేటా) భద్రత, నాణ్యతపై ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులు, ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమ డేటా నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవడానికి మూడు ప్రత్యేక రకాల ఉన్నతాధికారులను నియమించాలని స్పష్టం చేసింది. ‘డేటా ఓనర్లు’, ‘డేటా స్టీవార్డులు’, ‘డేటా కస్టోడియన్లు’ అనే పేర్లతో ఈ బాధ్యతలను అప్పగించనున్నారు.
ముగ్గురు రక్షకులు.. వారి విధులు, బాధ్యతలు
డేటా ఓనర్: నిర్దిష్ట విభాగానికి (డేటా డొమైన్) సంబంధించిన డేటాను వర్గీకరించడం, దాని నాణ్యతను పర్యవేక్షించడం, సమాచార భాగస్వామ్య నిబంధనలను ఆమోదించడం వీరి బాధ్యత. డేటాకు వీరే పూర్తి జవాబుదారీగా ఉంటారు.
డేటా స్టీవార్డ్: నిత్యం డేటా గవర్నెన్స్ ప్రమాణాల క్షేత్రస్థాయి అమలును వీరు పర్యవేక్షిస్తారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం సాధించడం, డేటా ప్రవాహాన్ని గమనించడం, ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి డేటా ఓనర్కు నివేదించడం వీరి విధి.
డేటా కస్టోడియన్: సమాచార సాంకేతిక, సాంకేతిక పర్యావరణ నిర్వహణను వీరు చూసుకుంటారు. యాక్సెస్ కంట్రోల్స్, డేటా స్టోరేజ్, బ్యాకప్, డిజాస్టర్ రికవరీ, సురక్షితమైన డేటా తొలగింపు వంటి సాంకేతిక భద్రతా చర్యలు వీరి పరిధిలోకి వస్తాయి.
మండలి ఆమోదం.. ప్రత్యేక విభాగం ఏర్పాటు
ఆర్బీఐ ప్రతిపాదనల ప్రకారం, ప్రతి నియంత్రిత సంస్థ తప్పనిసరిగా బోర్డు ఆమోదించిన డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను కలిగి ఉండాలి. దీని కోసం ఒక ప్రత్యేక డేటా ఫంక్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి చీఫ్ జనరల్ మేనేజర్ లేదా అంతకంటే ఉన్నత స్థాయి అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, డేటా నిర్వహణకు సంబంధించి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ (ఎస్ఎస్ఓటీ) విధానాన్ని అమలు చేయాలని దీనివల్ల సమాచారంలో ఎలాంటి తారుమారు లేదా వైరుధ్యాలు ఉండవని ఆర్బీఐ పేర్కొంది.
వ్యక్తిగత డేటా రక్షణ చట్టానికి అనుగుణంగా..
ఈ నూతన మార్గదర్శకాలు భారత ప్రభుత్వ ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం, 2023’ నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. థర్డ్-పార్టీ యాప్లు లేదా ఫిన్టెక్ సంస్థలతో కస్టమర్ల డేటాను పంచుకునేటప్పుడు కఠినమైన నిబంధనలు అవసరమని కేంద్ర బ్యాంక్ నొక్కి చెప్పింది.
ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు


