దేశీయంగా మెగా సెమీకండక్టర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో అవి ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవ రూపం దాల్చేలా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) తెలిపింది. ప్రతిపాదిత చిప్ల ఉత్పత్తి ప్రణాళికలు.. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్కి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదని వివరించింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సెమీకండక్టర్ ఇండియా 2026 జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పీహెచ్డీసీసీఐ ఫారిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ కో–చెయిర్ కరణ్ మంగ్లా పేర్కొన్నారు.
ప్రస్తుతం అనుమతులు పొందిన ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు, ఓఎస్ఏటీలు పూర్తి స్థాయిలో పని చేసినా కూడా దేశీయంగా నెలకొన్న డిమాండ్కి సరిపోదని.. మిగతా వాటి కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. భారత్లో సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల మార్కును దాటేయబోతుందని ఆయన పేర్కొన్నారు.
ఏడు రాష్ట్రాల్లో 12 ప్రాజెక్టులు..
సెమీకండక్టర్ల తయారీ విషయంలో భారత్ కేవలం సంకల్పానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంవైపు విజయవంతంగా మళ్లిందని కరణ్ చెప్పారు. ఏడు రాష్ట్రాల్లో రూ. 1.64 లక్షల కోట్ల విలువైన 12 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు. సాణంద్లో మైక్రాన్ ప్లాంటు అందుబాటులోకి రాగా, టాటా ఎలక్ట్రానిక్స్ ధొలెరా ప్లాంటు వేగంగా సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. ఒక క్లిష్టమైన మైలురాయిని అధిగమించామని, ఇక తదుపరి దశ మరింత కీలకమని కరణ్ వివరించారు. మౌలిక సదుపాయాలను మరింత వేగంగా ఏర్పాటు చేయడం, పరిశ్రమ స్థాయికి తగ్గట్లుగా నిపుణులను తయారు చేసుకోవడం, డిమాండ్కి తగ్గట్లుగా సరఫరా చేసేందుకు నిబద్ధతతో పనిచేయడమనే మూడు సూత్రాలతో మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలని పేర్కొన్నారు. ఉత్పత్తిలో జాప్యం జరిగే కొద్దీ ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్, డిఫెన్స్ తయారీ సంస్థలు ... దిగుమతులపై ఆధారపడటం మరింతగా పెరుగుతూ ఉంటుందని చెప్పారు.
3 లక్షల మంది నిపుణులు కావాలి..
ఇక నిపుణుల సంగతి చూస్తే .. చిప్ డిజైన్కి సంబంధించి ప్రపంచంలోనే సుమారు అయిదో వంతు సిబ్బంది భారత్లోనే ఉన్నప్పటికీ .. ఫ్యాబ్, ప్యాకేజింగ్ నిపుణుల కొరత ఉంటోందని వివరించారు. వచ్చే అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వ్యవధిలో భారత్లో 3,00,000కు పైగా సుశిక్షితులైన సెమీకండక్టర్ ప్రొఫెషనల్స్ అవసరమని కరణ్ చెప్పారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా విద్యా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి వేగంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతానికి గ్లోబల్ ప్రత్యామ్నాయాలు చౌకగా లభిస్తున్నప్పటికీ.. టెలికం, ఆటోమోటివ్, ఇతరత్రా పరిశ్రమలు ’భారత్ చిప్’నే కొనుగోలు చేయడానికి ముందునుంచే కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. చిప్ల ఉత్పత్తి ప్రస్థానంలో నాలుగో స్తంభంలాంటి చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) విడిభాగాలు, స్పెషాలిటీ కెమికల్స్ సరఫరా వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని కరణ్ వివరించారు.
ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు


