కేటాయించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
ఈ అంశంపై 10,15 రోజుల్లో విచారణ చేపడతామని వెల్లడి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజ్శాలకు సమీపంలో ముస్లింల ప్రార్థనల కోసం వేరుగా బహిరంగ ప్రదేశాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఇందులో నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ముస్లిం వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై తుది తీర్పు వచ్చే వరకు దీనిని కేవలం తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే భావించాలని పేర్కొంది. భోజ్శాల ప్రాంతంలో నిర్మాణ సంబంధమైన ఎలాంటి మార్పులు చేపట్టరాదంటూ భారత పురాతత్వ విభాగం(ఏఎస్ఐ)ను ఆదేశించింది.
అత్యంత సున్నితమైన భోజ్శాల విషయంలో హిందువులు, ముస్లింలు సహనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై రోజువారీ విచారణ చేపట్టి, ఒక పరిష్కారం కనుగొంటామని తెలిపింది. ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల–కమాల్ మౌలా మసీదు సముదాయాన్ని సరస్వతీ మాత ఆలయ ప్రాంగణంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచి్చన ఆదేశాల అంతరార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
‘ఇవి చాలా సున్నితమైన విషయాలు. కోర్టులో మాట్లాడే అంశాలు అనవసరంగా వివాదాలను సృష్టించవచ్చు. తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు. అందుకు మనం ఉపయోగించే ప్రతి పదం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో మధ్యంతర వెసులుబాటు కోరుతూ మా ముందుకు రావడం ఇదే మొదటిసారి. హైకోర్టు ఆదేశాలను, అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ నిస్సహాయతను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని 10 నుంచి 15 రోజుల్లోగా తగిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చేలా చూడాలన్నదే మా ఉద్దేశం’అని సీజేఐ మౌఖికంగా వ్యాఖ్యానించారు.


