అమ్మానాన్నలకు కొనుగోలు పాఠాలు నేర్పుతున్న చిన్నారులు
ఏ వస్తువు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో చెబుతున్న పిల్లలు
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో 72 శాతం, బొమ్మల కొనుగోళ్లు 57 శాతం జెన్ ఆల్ఫా నుంచే
రోజుకు సగటున 3.6 గంటలు ఫోన్తోనే..
పీడబ్ల్యూసీ జెన్ ఆల్ఫా 2026 నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఒరే కన్నా దుకాణానికి వెళ్లి అది తెచ్చు. తల్లీ టిఫిన్ షాపునకు వెళ్లి ఇడ్లీ తెచ్చు. కరోనా ముందు వరకూ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పినమాటలు. ప్రస్తుతం ఆ రోజులు మారాయి. టెక్నాలజీ పుణ్యమా అని జెన్ ఆల్ఫా( పిల్లలు) తల్లిదండ్రులకే కొనుగోలు పాఠాలు చెబుతున్నారు. ఫుడ్ నుంచి పానీయాలు, ఇతర వస్తువులు సైతం ఏమి కొనుగోలు చేయాలో.. ఏ వస్తువు ఎక్కడ కొనాలో పిల్లలే డిసైడ్ చేస్తున్నారు.
2010–2024 మధ్య జన్మించిన పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నట్లు ప్రైస్ వాటర్హౌస్ కూపర్ (పీడబ్ల్యూసీ) విడుదల చేసిన జెనరేషన్ ఆల్ఫా 2026లో పేర్కొంది. కరోనా సమయంలో క్లాసులు ఆన్లైన్లో జరగడంతో జెన్ ఆల్ఫా పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల వినియోగంలో ఆరితేరినట్టు ఆ నివేదిక వెల్లడించింది.
70 శాతం చిన్నారులకు సొంత ఫోన్లు, ట్యాబ్లు
ఏడు నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 70 శాతం మంది సొంత ఫోన్ లేదా ట్యాబ్ కలిగి ఉన్నారని వెల్లడించింది. వీరిలో 97 శాతం మంది కొనుగోళ్ల విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
రోజులో 3.6 గంటలు ఫోన్లతోనే..
జనరేషన్ ఆల్ఫా పిల్లలు బయట ప్రపంచంతో కంటే ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వే వెల్లడించింది. సగటున కనీసం 3.6 గంటలు వినోదం కోసం ఫోన్లు చూస్తున్నట్లు పేర్కొంది. బయట ఆడుకోవడానికి లేదా చదువుకోవడానికి వెచ్చించే సమయం కంటే రెట్టింపు సమయం ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 68 శాతం మంది యూట్యూబ్ చూస్తుంటే, 54 శాతం మంది గేమింగ్ ప్లాట్ఫామ్స్, 49 శాతం స్ట్రీమింగ్ సర్వీసెస్, 29 శాతం మంది టిక్టిక్తో కాలక్షేపం చేస్తున్నారు.
ఆన్లైన్ ఆర్డర్లలో అగ్రస్థానం ఆహారం, పానీయాలదే
ఆన్లైన్ వ్యయాల్లో చూస్తే ఆహారం, పానీయాలదే తొలిస్థానం. జెన్ ఆల్ఫా ఆన్లైన్షాపింగ్లో 72 శాతం ఫుడ్ అండ్ డ్రింక్స్ ఉండగా, 57 శాతంతో బొమ్మలు కొనుగోళ్లు రెండోస్థానంలో ఉంది. దుస్తులు 55 శాతం, 53 శాతం డిజిటల్ యాప్స్ ఉన్నాయి. పిల్లలు ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నా నగదు చెల్లింపులు పెద్దలే చేస్తుండడం గమనార్హం. జెన్ఆల్ఫా పిల్లలు కేవలం కంటెంట్ను వినియోగించుకోవడమే కాకుండా ఆన్లైన్లో నేర్చుకున్న వాటిని ఉపయోగించి తమ కుటుంబాలు డబ్బు ఖర్చు చేసే విధానాన్ని కూడా మారుస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.


