సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. న్యామద్దెల గ్రామం నుంచి హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ దాకా వైఎస్సార్సీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. హంద్రీనీవా కాలువ వద్ద రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాను చెబితేనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పాదయాత్రలో మాజీ మంత్రులు ఉషాశ్రీచరణ్, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, హిందూపురం సమన్వయకర్త దీపిక, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, కదిరి సమన్వయకర్త మక్బూల్ పాల్గొన్నారు.


