సాక్షి, విజయవాడ: సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి నుండి విజయవాడకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజును విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించే అవకాశం ఉంది. అనంతరం సీట్ కార్యాలయంలో సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ సిద్ధమైంది.
కాగా, సాయికృష్ణ లాకప్డెత్పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.


