ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం! | RBI Cracks Down on Mis Selling Full Refunds for Customers | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!

Jun 16 2026 7:45 AM | Updated on Jun 16 2026 7:49 AM

RBI Cracks Down on Mis Selling Full Refunds for Customers

బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే ప్రక్రియపై నిబంధనలను ఆర్‌బీఐ మరింత కఠినతరం చేసింది. రుణదాతలు, బ్యాంకింగ్ సిబ్బంది కస్టమర్లను తప్పుదారి పట్టించి ఉత్పత్తులను అంటగట్టే ‘మిస్ సెల్లింగ్’ పద్ధతులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.

అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే?

సవరించిన నూతన మార్గదర్శకాలు తొలుత జులై 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక, కార్యాచరణ మార్పులు చేసుకోవడానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ గడువును పొడిగించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

నూతన మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు

  • బ్యాంకులు ఏ రకమైన ఆర్థిక ఉత్పత్తి లేదా సేవను విక్రయించాలన్నా సదరు కస్టమర్ స్పష్టమైన ఆమోదం తీసుకోవాలి. అలాగే ఆ ఉత్పత్తి కస్టమర్‌కు ఎంతవరకు అనుకూలమైనదో ముందే నిర్ధారించుకోవాలి.

  • సంతకం చేసిన డిక్లరేషన్లు, ఓటీపీ-ఆధారిత ఆమోదాలు, డిజిటల్ ధ్రువీకరణలు లేదా ఒప్పంద పత్రాలలో స్పష్టంగా పేర్కొన్న సమ్మతి నిబంధనల ద్వారా మాత్రమే ఈ అనుమతిని సేకరించాల్సి ఉంటుంది.

  • డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదా మోసగించేలా రూపొందించే వినియోగదారు-అనుభవ పద్ధతులు లేదా డార్క్‌ ప్యాటర్న్స్‌(డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను మోసగించడానికి లేదా వారి ప్రమేయం లేకుండా కొన్ని పనులు చేయించడానికి ఉపయోగించే వ్యూహాలు) వాడకాన్ని ఆర్‌బీఐ పూర్తిగా నిషేధించింది.

తప్పుగా విక్రయిస్తే.. పూర్తి రీఫండ్!

బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిబంధనను ఆర్‌బీఐ ఈసారి తీసుకొచ్చింది. ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు తప్పుగా విక్రయించినట్లు రుజువైతే బ్యాంకులు ఆ విక్రయాన్ని రద్దు చేయడమే కాకుండా.. కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రద్దు, రీఫండ్ గురించిన సమాచారాన్ని కస్టమర్‌కు అధికారికంగా తెలియజేయడం తప్పనిసరి.

ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఏజెంట్లే..

సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆర్థిక ఉత్పత్తులను ప్రమోట్ చేసే వారిపై కూడా ఆర్‌బీఐ నిఘా పెంచింది. ప్రమోషన్లు లేదా కస్టమర్లను ఆకర్షించే ప్రక్రియలో పాల్గొనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సన్లు, అనుబంధ సంస్థలు, ఇతర డిజిటల్ మార్కెటింగ్ మధ్యవర్తులను ఇకపై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లుగానే పరిగణిస్తారు. తద్వారా వారికి కూడా బ్యాంకింగ్ నిబంధనలు, బాధ్యతలు వర్తిస్తాయి.

ఉద్యోగుల ఇన్సెంటివ్‌లపై స్పష్టత

బ్యాంక్ సిబ్బంది కస్టమర్లపై ఒత్తిడి తెచ్చి ఉత్పత్తులను విక్రయించకుండా చూసేందుకు ఆర్‌బీఐ ప్రోత్సాహకాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. థర్డ్ పార్టీ సంస్థలు (ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి) నియంత్రిత సంస్థల/బ్యాంకుల ఉద్యోగులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించడాన్ని పూర్తిగా నిషేధించారు. బ్యాంకులు లేదా నియంత్రిత సంస్థలు తమ సొంత సిబ్బందికి అంతర్గతంగా ప్రోత్సాహకాలను అందించుకోవచ్చు.

గమనిక: అయితే, ఈ అంతర్గత ప్రోత్సాహక నిర్మాణాలు ఉద్యోగులను దూకుడుగా అమ్మకాలు జరిపేలా ప్రోత్సహించకూడదని, అది మిస్ సెల్లింగ్‌కు దారితీయకూడదని ఆర్‌బీఐ హెచ్చరించింది.

ఈ నూతన నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు తమ సొంత ప్రకటనలు, మార్కెటింగ్, అమ్మకాల ప్రక్రియల కోసం ఒక సమగ్రమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో మిస్ సెల్లింగ్ మోసాలకు అడ్డుకట్ట పడటంతోపాటు కస్టమర్లలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం మరింత బలపడనుంది.

ఇదీ చదవండి: బంగారు పంట పండింది!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement